NEWS
న్యూ ఇయర్ కి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి.. ఉద్యోగులందరికీ భారీ పార్టీ ఇచ్చే సీఈవో ఎక్కడైనా ఉంటారా.. కచ్చితంగా ఉండనే ఉండరు. ఇదే కదా మీ సమాధానం. కానీ నిజంగానే ఉన్నాడు. స్నాప్ చాట్ సీఈవొ ఇవాన్ స్పైగల్ ఇదే చేశారు. ఇవాన్ స్పైగల్ తన ఉద్యోగులకు ఏకంగా రూ.26 కోట్లు ఖర్చు పెట్టి న్యూఇయర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ కోసం వివిధ దేశాలకు చెందిన 5000 మంది స్నాప్చాట్ ఉద్యోగులు ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజెల్స్కు చేరుకొన్నారు. లాస్ ఏంజెల్స్లోని ప్రముఖ మైక్రోసాఫ్ట్ థియేటర్ను అద్దెకు తీసుకుని మరీ ఈ పార్టీ నిర్వహించారట. పార్టీలో వివిధ రకాల ఆహార పదార్థాలే కాకుండా గేమ్స్ కూడా నిర్వహించారు. ప్రముఖ అమెరికన్ పాప్స్టార్ డ్రేక్తో కచేరీ కూడా నిర్వహించారు.
పార్టీ ఖర్చు మొత్తం ఇవానే పెట్టుకున్నారు. ఆయన వార్షిక ఆదాయం 3.5 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.22వేల కోట్లు. గతంలో స్నాప్ చాట్ ని చాలా మంది వినియోగదారులు ఉపయోగించేవారు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్ రాకతో స్నాప్ చాట్ కాస్త వెనకపడింది. బిజినెస్ లో వెనకపడ్డామని.. పార్టీలు చేసుకోవడంలో మాత్రం కాదని ఇవాన్ ఈ న్యూ ఇయర్ పార్టీ ద్వారా తెలియజేశాడు. పార్టీలు ఇవ్వడంలో మాత్రమే కాదు.. వివాదాల్లోకి ఎక్కడంలోనూ ఈ సీఈవో ముందుంటాడు. గతేడాది భారతీయులపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ఇవాన్ వార్తల్లో నిలిచారు. దాంతో పలువురు భారతీయ నెటిజన్లు ఇవాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు స్నాప్చాట్ యాప్ను డిలీట్ కూడా చేశారు.