శామ్‌సంగ్ ట్యాబ్ కం ఫోన్.. నాలుగు రోజుల్లో భారత విపణిలోకి

By Nagaraju penumalaFirst Published Sep 26, 2019, 3:55 PM IST
Highlights

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్‌ ‘ఫోల్డబుల్’ ఫోన్.. ట్యాబ్ కమ్ స్మార్ట్ ఫోన్ భారత విపణిలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ ఒకటో తేదీన భారత విపణిలో ఆవిష్కరించేందుకు శామ్ సంగ్ ఏర్పాట్లు చేస్తున్నది. దాని ధర సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుంది.

హైదరాబాద్: ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్‌ మొబైల్‌ డివైస్‌ను ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ అభివృద్ధి చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్‌ పీసీగా నూ వినియోగించుకునే వీలుగా దీన్ని తయారు చేసింది. మొత్తం ఆరు కెమెరాలు అమర్చారు.

ఫోన్ తెరిచినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్‌తో ట్యాబ్లెట్‌ పీసీ మాదిరి, మూసినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్‌తో స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించొచ్చు. 5జీ టెక్నాలజీతో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 7 నానో మీటర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ఆక్టాకోర్‌ చిప్‌ వంటి ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లో 4,380 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఫోన్‌ను ట్యాబ్‌గా వాడుతున్నప్పుడు ఒకేసారి మూడు యాప్‌లు తెరుచుకునే వీలు ఉంది. ఇటీవలే దక్షిణ కొరియాలో ఆవిష్కరించిన ఈ ఫోన్ అమెరికాలో శుక్రవారం అడుగుపెడుతోంది.

భారత మార్కెట్లో అక్టోబరు 1న విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్‌ ధర సుమారు రూ.1.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. గ్యాడ్జెట్‌ కావాల్సినవారు ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన ఔట్‌లెట్లలో కూడా లభిస్తుంది. స్పేస్‌ సిల్వర్, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో రూపొందించారు.

click me!