మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 17 మంది కూలీల మృతి

First Published Apr 10, 2018, 12:37 PM IST
Highlights
మరో 15 మందికి తీవ్ర గాయాలు

మహారాష్ట్ర సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై - బెంగళూరు జాతీయ రహదారిపై కూలీలతో ప్రయాణిస్తున్న ఓ డిసిఎం వ్యాన్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కర్ణాటకలోని బీజాపూర్ నుంచి కొంతమంది కూలీలు ఓ డిసిఎం వాహనంలో పుణెకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనం ఉదయం 4.30గంటల ప్రాంతంలో సతారా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఖంబాట్కీ ఘాట్‌ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్ కు ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో డీసీఎంలో ప్రయాణిస్తున్న 17 మంది కూలీలు చనిపోగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.  

click me!