
తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాత్రివేళ నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్తూ జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ డీఎఫ్వో ఫణికుమార్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ. కపిలతీర్థం జంగిల్ బుక్ దగ్గర చిరుత పులి పిల్లలతో సంచరిస్తోందన్నారు. అయితే... తాము పెట్టిన బోనులో ఓ చిరుత పిల్ల చిక్కుకుందని, దానిని జూపార్కుకు తరలించామన్నారు. తల్లి చిరుత మాత్రం చిక్కినట్లే చిక్కి మళ్ళీ తప్పించుకుందన్నారు. మొదటి ఘాట్ రోడ్డు దిగువన వారం రోజులుగా.. పిల్లలతో కలిసి చిరుత సంచరిస్తోందన్నారు. దీంతో కపిలతీర్థం-అలిపిరి మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీలైనంత తొందరలో తల్లి చిరుతను పట్టుకుంటామని ఫణికుమార్ తెలిపారు.