
ఈ రోజు సౌత్ కొరియాలో గంటకు 300 కి.మీ వేగంతో వెళ్లే హైస్పీడ్ ట్రైన్లో తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ప్రయాణించారు. దాని వెనక చాలా ప్లాన్ ఉంది. ఎపుడమలవుతుందో గాని, ఇలాంటి వ్యవస్థ తెలంగాణాలో ఉండాల్సిందేనని ఆయన భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సియోల్ నుంచి డ్యాగు పట్టణానికి హైస్పీడ్ ట్రెయిన్లో పర్యటించారు. భారత్లోని టిఎర్ 2 పట్టణాలు ప్రధాన నగరాలతో అనుసంధానం కావాలంటే.. వాటి మధ్య దూరాన్ని త్వరగా తగ్గించేలా గంటకు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే, వైఫై అనుసంధానిత హైస్పీడ్ రైళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉందని కేటీఆర్ ట్విట్ చేశారు. హైస్పీడ్ ట్రెయిన్లో మంత్రి కేటీఆర్తోపాటు ప్రభుత్వ సలహాదారు వివేక్, ఇతర అధికారుల బృందం ఉంది.
కేటీఎక్స్ హైస్పీడ్ ట్రెయిన్ ప్రత్యేకతలివే..
దక్షిణ కొరియా రాజధాని సియోల్-డ్యాగు పట్టణం మధ్య ఈ హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 417.5 కిలోమీటర్లు. గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కొరియన్ ట్రెయిన్ ఎక్స్ప్రెస్ (కేటీఎక్స్)కు చెందిన హైస్పీడ్ ట్రెయిన్.. రెండు గంటల పది నిమిషాల్లో వ్యవధిలోనే గమ్యానికి చేరుకుంటుంది.