‘‘ఓటువేసిన వారికి.. వేడివేడి దోశె ఉచితం’’

First Published May 12, 2018, 12:10 PM IST
Highlights

సూపర్ ఆఫర్ ఇచ్చిన హోటల్ యజమాని

‘ఓటు వేయండి.. ఉచితంగా వేడి వేడి దోశెలు ఆరగించండి’.. ఈ మాట చెబుతున్నది ఏ రాజకీయ పార్టీ నేతో కాదు. ఓ హోటల్ యజమాని. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు, ప్రతి పక్ష పార్టీ నేతలు తమ వంతు కృషి చేశాయి. శనివారం ఉదయం కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్వీట్ చేశారు. అయితే ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఓ హోటల్‌ నిర్వహకుడు వినూత్న పద్ధతిలో ముందుకు వచ్చాడు.

నిసర్గ గ్రాండ్‌ హోటల్‌ యజమాని కృష్ణ రాజ్‌ బెంగళూరులో ఓటింగ్‌ శాతం పెంచడానికి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ రోజు మొదటి సారిగా ఓటుహక్కు వినియోగించుకున్న యువతకు తన హోటల్‌లో ఉచితంగా దోశ అందిస్తున్నాడు. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఇతరులకు ఫిల్టర్‌ కాఫీని ఇస్తానని చెబుతున్నాడు. అయితే ఉచిత దోశ, కాఫీని పొందాలంటే ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్‌లో చూపించాల్సి ఉంటుంది.

బెంగళూరులో నమోదవుతున్న తక్కువ ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికే తాను ఇలా వినూత్నంగా ముందుకు వచ్చినట్లు రాజ్‌ తెలిపారు. ‘మీరు ఎవరికైనా ఓటు వేయండి.. కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. మా హోటల్‌లో ఉచిత దోశ, కాఫీ పొందండి.’ అని అంటున్నారు ఈ హోటల్‌ నిర్వాహకుడు.

click me!