
అగ్రరాజ్యం అమెరికాను హరికేన్ ఇర్మా గజగజలాడిస్తోంది. కరీబియన్ దీవులను వణికించిన ఇర్మా.. ఆదివారం ఫ్లోరిడా తీరాన్ని తాకింది. తొలుత తీవ్రత తగ్గినట్టే అనిపించినా.. మళ్లీ బలం పుంజుకొని పెను తుపానుగా మారింది. గంటలకు 193 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. వీటి ధాటికి అక్కడి ప్రజలు తట్టుకోలేక పోతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో అల్లల్లాడిపోతున్న ఫ్లోరిడాలోని ప్రజలను కాపాడేందుకు పలువురు ఇండియన్ అమెరికన్లు ముందుకు వచ్చారు.తమ వద్ద ఉన్న పూల్ రిసోర్స్ లను ఉపయోగించి.. అట్లాంటా, జార్జియాలోని ఇండియన్ అమెరికన్లు.. ఫ్లోరిడాలోని కాపాడుతున్నారు. వారిని ఫ్లోరిడా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇర్మా ధాటికి కరేబియన్ తీరంలో ఇప్పటికే 25మంది ప్రాణాలు కోల్పోగా.. ఫ్లోరిడాలో ముగ్గురు మృతిచెందారు. చాలా మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఇప్పటికే తరలి వెళ్లారు. 2010 సంవత్సర రికార్డుల ప్రకారం.. 120,000మంది ఇండియన్ అమెరికన్లు ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. దీంతో వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను సైతం ముమ్మరం చేశారు.
ఫ్టోరిడా నుంచి తరలివచ్చిన వారికి అట్లాంటాలోని పలు సంఘాలు వారికి వసతి కల్పించారు. అట్లాంటా చేరుకున్న బాధితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వాషింగ్టన్ లోని భారత రాయబారి అధికారులకు చెప్పారు. ఓర్లాండాలోని భారత కుటుంబీకులు కూడా ఇర్మా బాధితులకు వసతి సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చారు.
ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇర్మా నష్టాన్ని పూడ్చుకోవాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని.. కానీ డబ్బు కంటే ముందు ప్రజల రక్షణే తనకు ముఖ్యమని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో ఉన్నట్లు చెప్పారు. మరో నాలుగైదు గంటల పాటు ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీని గురించి అలాబమా, జార్జియా, దక్షిణ కరోలినా, టెన్సెస్సే గవర్నర్లతోనూ చర్చించినట్లు ట్రంప్ వెల్లడించారు.
అంతేకాదు.. ఫ్లోరిడాలోని ప్రజలను రక్షించేందుకు అమెరిన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. దాదాపు 9,900 మంది సైనికులు, ఆర్మీ పోలీసులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు.