
యాభై ఏళ్ల క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదానికి సంబంధించిన మానవ శకలాలను ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వతాలపై గుర్తించారు. ఈ అవశేషాలు 1966 లేదా 1950లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతులవి అయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
డేనియల్ రోచేకు విమాన ప్రమాద అవశేషాలను గుర్తించడమంటే ఆసక్తి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలను తెలుసుకుని వాటి శిథిలాలను సేకరించారు. ఈ నేపథ్యంలో ఆల్ప్స్ పర్వతాలపై మానవ అవశేషాలను గుర్తించి... అధికారులకు సమాచారం అందించాడు.
ఇప్పటి వరకు తాను చాలా విమాన శకలాలను కనుగొన్నానని.. కానీ మానవ శకలాలు మాత్రం గుర్తించలేదని... ఈ సారి ఓ మనిషి చేయి, తొడ భాగాన్ని కనుగొన్నాను అని రోచే తెలిపారు.
1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 707 విమానం.. మాంట్ బ్లాక్ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు. ఈ రెండు విమానాలల్లో ఒక విమానంలోని మృతుల అవశేషాలు అయ్యి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.