మంత్రి సోమిరెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం

First Published Dec 17, 2017, 11:39 AM IST
Highlights
  • మంత్రి సోమిరెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం
  • రుణామాఫీ పనులు జాప్యం చేస్తున్నారని అసంతృప్తి

మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ ఎందుకీ అసంతృప్తి అంటే.. రైతురుణమాఫీ సరిగా చేయనందుకట. అసలు విషయం ఏమిటంటే.. శనివారం కేబినేట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు విషయాలపై చర్చించిన చంద్రబాబు.. రైతు రుణమాఫీ విషయాన్ని కూడా చర్చకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ మూడో విడుత నిధులను రైతులకు అందజేయడంలో మంత్రి సోమిరెడ్డి విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడో విడుతలో 3,600కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1600కోట్లు విడుదల చేసింది. కాగా ఇందులో మొత్తం  కూడా బ్యాంకులకు చేరలేదు. దీంతో మూడో విడుత రైతు రుణమాఫీ అస్తవ్యస్తంగా మారింది.  ఇది చంద్రబాబు అసంతృప్తి.  పోలవరం నిధుల సమీకరణే తనకు పెద్ద తలనొప్పిగా మారిందని.. రుణమాఫీ లాంటి చిన్న పనులు కూడా సరిగా చేయలేరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వాస్తవానికి వస్తే.. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది. రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది.  అలాంటి సమయంలో మంత్రి మాత్రం ఏమి చేస్తాడు. అందుకే సీఎం అందరిముందు ఆగ్రహం వ్యక్తం చేసినా నిశ్శబ్ధంగా ఉండిపోయాడు.

మరో విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు రుణమాఫీ సరిగా చేయలేదని ఒకవైపు రైతులు, మరో వైపు ప్రతిపక్షం గోలపెడుతోంది. అధికార పార్టీ నేతలు మాత్రం రెండు దశల రుణమాఫీ పూర్తయ్యిందని.. మూడో విడతలో మాత్రమే జాప్యం జరిగిందనడం విడ్డూరంగా ఉంది. నిజంగా మొదటి రెండు విడతల రుణమాఫీ సక్రంగా జరిగి ఉంటే కనీసం సగం మందికైనా రుణమాఫీ పూర్తయ్యేది. మరి అలా జరగలేదంటే అర్థం ఏమిటి? మొదటి రెండు విడతలు కూడా మూడో విడతలాగే జరిగాయనడంలో సందేహం లేదు. సమస్య అంతా తన దగ్గరపెట్టుకొని మీడియా ముందు మాత్రం చంద్రబాబు మంత్రులపై ఉత్తుత్తి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  

 

click me!