మళ్లీ అదే మోసం

First Published Feb 6, 2018, 5:36 PM IST
Highlights
  • నాలుగేళ్లుగా ఆయనేది చెబుతున్నారో.. తాజాగా మళ్లీ అదే చెప్పారు.

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మళ్లీ పాత పాటే పాడుతున్నారు. నాలుగేళ్లుగా ఆయనేది చెబుతున్నారో.. తాజాగా మళ్లీ అదే చెప్పారు. ఇటీవల జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ కి ఏపీ కి తీవ్ర అన్యాయం చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణాల ఊసు కూడా ఎత్తలేదు. దీంతో.. ఏపీలో ప్రజలు రగిలిపోయారు. ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవ్వక ముందే ఏదో ఒకటి చేయాలని భావించిన టీడీపీ నేతలు మంగళవారం ఢిల్లీలో తమ గోడు వినిపించారు. ఏపీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


దీంతో.. దీనిపై జైట్లీ స్పందించారు.ఏపీ విభజన హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామన్నారు. ప్రత్యేక హోదాతో రావాల్సిన నిధులను ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఎలా ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ (ఈఏపీ) నిధుల రూపంలో ఆ లోటును భర్తీ చేస్తామని చెప్పారు. ఈ నిధులకు సంబంధించి జనవరి 3న సీఎం చంద్రబాబు తమకు లేఖ రాశారని చెప్పారు. నాబార్డు ద్వారా ఆ నిధులు కేటాయించాలని సీఎం ఆ లేఖలో కోరారని జైట్లీ చెప్పారు.

అయితే, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు ఇవ్వాలంటే సమస్య ఎదురవుతోందని జైట్లీ అన్నారు. అలా ఇస్తే రాష్ట్ర రుణ సామర్థ్యం తగ్గుతుందని చెప్పారు. ఈఏపీ నిధులు ఎలా ఇవ్వాలనే విషయమై చర్చిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ నిధుల మంజూరు చేసే అంశంపై చర్చిస్తున్నామని వివరించారు. ఈ విషయమై చర్చించేందుకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని దిల్లీకి రావాలని పిలిచామని చెప్పారు. ఇప్పటికే ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి రూ.3,900 కోట్లు చెల్లించామన్నారు.ఇక రైల్వే జోన్‌ విషయంలో అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. జోన్‌ విషయంలో సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు.


 అయితే.. జైట్లీ చెప్పిన దానిలో ఒక్క మాట కూడా కొత్తది లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నదే మళ్లీ డప్పు కొట్టి చెప్సడం విశేషం. లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో కేంద్రం దిగివస్తుందని అందరూ ఆశించారు. వెంటనే స్పందిస్తే.. హామీల నెరవేర్చడం గురించి మాట్లాడతారని భావించారు. కానీ మళ్లీ అవే మాటలతో మరోసారి మోసం చేయడం మొదలుపెట్టారు.

click me!