ఆర్టిస్టును, మ్యూజిక్ పెట్టుకుంటే బాగు: చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు సెటైర్

First Published Apr 23, 2018, 7:05 PM IST
Highlights

ఆర్టిస్టును, మ్యూజిక్ పెట్టుకుంటే బాగు: చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు సెటైర్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. మాట్లాడే సమయంలో చంద్రబాబు పక్కన ఆర్టిస్టులను, మ్యూజిక్ ను పెట్టుకుంటే వినసొంపుగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. టీడీపిలో ఉన్న చాలా మంది నాయకులు పక్క పార్టీ వైపు చూస్తున్నారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. మే 15వ తేదీ తర్వాత అన్నీ బయటకు వస్తాయని అన్నారు. 

టీడిపితో పొత్తు వల్ల తాము బలహీనపడ్డామని, టిడిపితో పొత్తు ఎందుకు పెట్టుకున్నామా అని ఇప్పుడు బాధపడుతున్నామని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు అవినీతిపై త్వరలోనే సిబిఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. 

కేంద్రం ఎపికి రూ.9,300 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కానీ టిడిపి ప్రభుత్వమే తీసుకోకుండా రాద్దాంతం చేస్తోందని అన్నారు. తిరుపతి సభ ఎందుకు పెడుతున్నారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.

చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించలేదా అని ఆయన ప్రశ్నించారు. విశాఖకు రైల్వే జోన్ తెచ్చే బాధ్యత తమదేనని అన్నారు. బాలకృష్ణ ప్రధాని మోడీపై నోరు పారేసుకోవడం దారుణమని అన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ వచ్చినప్పుడు తన మామగారి కోసం కలుస్తానని చెప్పారు.

click me!