NEWS
వైసీపీ రాజకీయమంతా పెద్ద ఫేక్ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన ఆయన ప్రతిపక్ష పార్టీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఫేక్ పార్టీ.. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలు అని దుయ్యబట్టారు. వైసీపీ రాజకీయమే ఫేక్ అని వ్యాఖ్యానించారు.
అనంతరం పార్టీ కార్యకలాపాల గురించి చర్చించారు.ఈ నెల 21నుంచి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని, అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ విజయాల పండుగలు నిర్వహించాలని నేతలకు తెలిపారు. ప్రభుత్వ విజయాలపై రోజుకో అంశంపై ప్రచారం చేయాలన్నారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యమని చెప్పారు.
విజయవాడలో ఈనెల 20న నిరసన దీక్షపై సమావేశంలో చర్చించారు. 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని... దీక్షలలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాల్లో 13మంది మంత్రులు దీక్షలలో పాల్గొనాలని ఆదేశించారు. మిగిలిన మంత్రులు విజయవాడ దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర బంద్ కారణంగా ప్రజలకు నష్టం జరుగుతుందే తప్ప.. వచ్చే లాభం ఏమీ లేదన్నారు. ఏదైనా శాంతియుతంగానే సాధించాలని.. బంద్ లాంటివి నిర్వహించి మనకు మనం శిక్షలు వేసుకోకూడదని సూచించారు.