
ఏఐడీఎంకే కాబోయే అధినేత్రి, తమిళనాడు చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడానికి కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.
పార్టీ మొత్తం తననే సీఎం గా ఉండమని చెప్పిన తరుణంలో కేంద్రం అడ్డుకట్ట వేయడం.. పన్నీరు సెల్వంకే మద్దతు ఇవ్వడంతో చిన్నమ్మకు కాస్త అమ్మ పీఠం దక్క కుండా పోయింది.
అంతేకాకుండా శశికళకు చెక్ పెట్టే వ్యూహంతోనే కేంద్రం ఆమె నమ్మిన బంటు, మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు చేయించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ తరుణంలో శశికళ కేంద్రంపై పై చేయి సాధించడానికి పావులు కదుపుతోంది.
ఈ నేపథ్యంలోనే తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న సినీ నటుడు అజిత్ ను దగ్గర తీస్తుంది. పోయిస్ గార్డెన్ కు రప్పించి మరీ చిన్నమ్మ అతడితో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
అజిత్ కు మొదటి నుంచి అమ్మ పార్టీ తో మంచి సంబంధాలున్నాయన్న విషయం తెలిసిందే. అందుకే అజిత్ ను దగ్గర తీస్తే తన బలం పెరుగుతుందని , పార్టీ చీలినా తన వైపే ఎక్కువమంది వస్తారనే ముందస్తు వ్యూహంతో శశికళ ఇలా సినీ గ్లామర్ ను కూడా తనవైపు తిప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు తమిళ రాజకీయాలు శశికళ వర్సెస్ బీజేపీగా మారాయి. ఇందులో చిన్నమ్మ విజయం సాధిస్తారా.. లేదా కమలం వికసిస్తుందా అనేది చూడాలి.