ఇంతకీ, ఎవరీ అరుణ్ జైట్లీ ?

Published : Jan 30, 2018, 04:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఇంతకీ, ఎవరీ అరుణ్ జైట్లీ ?

సారాంశం

జైట్లీ బీజేపీలో చేరిన నాటి నుంచి  పార్టీ కోసం చాలా కృషి చేశారు. గత ఎన్నికల్లోనూ, గుజరాత్ ఎన్నికల సమయంలోనూ.. పార్టీ గెలుపు వెనుక జైట్లీ తీవ్ర కృషి దాగి ఉంది

అరుణ్ జైట్లీ... ప్రమేయం లేకుండా ఇపుడు సెంటర్లో ఏ కార్యక్రమం రూపొందదు. నెంబర్ టూ అని చెప్పలేం గాని, ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమయిన వ్యక్తి అరుణ్ జైట్లీయే. పార్టీ పరంగా  బిజెపి అధ్యక్షుడు  అమిత్ షా  ప్రధాని మోదీకి ఎంత ముఖ్యుడో, ప్రభుత్వ వ్యవహారాలలో ఆర్థిక మంత్రి జైట్లీ అంత ముఖ్యుడు. ఇలాంటి అరుణ్ జైట్లీ  గురించి కొన్ని ముచ్చట్లు...

 

భారతీయ జనతా పార్టీ కీలక నేతల్లో అరుణ్ జైట్లీ ఒకరు. ప్రస్తుతం జైట్లీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. జైట్లీ గతంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. సుప్రీం కోర్టు సీనియర్  అడ్వకేట్ గానూ విధులు నిర్వర్తించారు. 2002, 2004లో బీజేపీ  జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆ మధ్య వచ్చిన  ‘ వన్ మ్యాన్ వన్ పోస్టు’ పాలసీ కింద పార్టీ వ్యవహారాలనుంచి తప్పుకున్నారు.  2009లో జైట్లీని రాజ్యసభ్యుడుగా నియమించారు. దీంతో.. ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. అరుణ్ జైట్లీ బీసీసీఐ వైస్ ప్రెసెడెంట్ గా కూడా వ్యవహరించారు. అయితే.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లు జరగడంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఫ్యామిలీ...

అరుణ్ జైట్లీ లో కుటుంబంలో దాదాపు అందరూ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలే. జైట్లీ పుట్టి పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలోని నరైనా విహార్ లో. జైట్లీ తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ కూడా న్యాయవాది. తల్లి రతన్ ప్రభ.. గృహిణిగా ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. చిన్నతనం నుంచి చదువుతోపాటు.. క్రికెట్, డిబెట్ లలో చురుగ్గా పాల్గొనేవారు. 1973లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి జైట్లీ ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. జైట్లీకి బాల్యం నుంచి రాజకీయాలు, న్యాయశాస్త్రం మీద ఎక్కువ శ్రద్ధ కనపరిచేవారు. ఎల్ఎల్ బీ చేస్తున్న సమయంలోనే ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితం మొదలయ్యింది. తర్వాత ఆయన జనతా పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితులై.. ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ..  అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత జైట్లీ.. సంగీత జైట్లీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సోనాలీ జైట్లీ, రోహన్ జైట్లీ సంతానం.

రాజకీయ ప్రస్థానం...

విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నికైన తర్వాత జైట్లీ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జయప్రకాశ్ నారాయణ్ కి ఫాలోవర్ గా ఉండేవాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు.. దానిని వ్యతిరేకించి జైలు శిక్షని కూడా జైట్లీ అనుభవించారు. 1977లో కాంగ్రెస్ ఓడిపోగా.. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జైట్లీ లోక్ తంత్ర యువ మోర్చకి కన్వీనర్ గా వ్యవహరించారు. 1977లో జైట్లీ ఏబీవీపీ ఢిల్లీ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 1980లో ఆయన బీజేపీలోకి అడుగుపెట్టారు. తర్వాత అదే సంవత్సరం  ఆయన బీజేపీ ఢిల్లీ యూనిట్ యూత్ వింగ్ కి సెక్రటరీగా నియమితులయ్యారు.

*1991లో బీజేపీ నేషనల్ ఎక్స్ గ్యూటివ్ మెంబర్ అయ్యారు

* 1999లో సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.

*2000 సంవత్సరంలో తొలిసారిగా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

*అదే సంవత్సరం న్యాయ శాఖ మంత్రిగా కూడా జైట్లీ నియమితులయ్యారు.

* రామ్ జేత్మలానీ.. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న సమయంలో.. ఆయన స్థానంలో ఆ పదవికి జైట్లీ నియమితులయ్యారు. 

* 2002లో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న జైట్లీ 2003 జనవరి వరకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగారు.

* ఆ తర్వాత మళ్లీ కేంద్ర మంత్రి పదువులు చేపట్టి  2004  వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు.

* 2006, 2012లో కూడా ఆయన గుజరాత్ కి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.

* 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి  అమృత్ సర్ నుంచి జైట్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బీజేపీ అధికారంలోకి రావడంతో జైట్లీ మరోసారి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. మే 26, 2014 నాటి నుంచి జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తూన్నారు.

* అంతేకాదు.. జైట్లీ బీజేపీలో చేరిన నాటి నుంచి  పార్టీ కోసం చాలా కృషి చేశారు. గత ఎన్నికల్లోనూ, గుజరాత్ ఎన్నికల సమయంలోనూ.. పార్టీ గెలుపు వెనుక జైట్లీ తీవ్ర కృషి దాగి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu