
భారతీయ జనతా పార్టీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయింది. బుధవారం ఉదయం ఢిల్లీలో.. యువ తెలంగాణ పార్టీని అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ రెడ్డి బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ సహా పలువురు నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను గద్దె దించడమే తమ లక్ష్యమని, అందుకే బీజేపీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేశామన్నారు. దేశం మోదీ పాలన ఎలా ఉందో.. తెలంగాణలో కేసీఆర్ పాలన ఏవిధంగా ఉందో అందరికీ తెలుసని అన్నారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువతెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశామన్నారు. ఇక, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో భారీ ర్యాలీ, బహిరంగ సభకు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా సమాచారం.
తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి నేతృత్వంలో యువ తెలంగాణ పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయను తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేశాయి. అయితే బీజేపీ వైపు ఆయన మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనానికి అంగీకరాం తెలుపుతూ బీజేపీ జాతీయ నాయకత్వానికి లేఖ కూడా రాశారు. ఇక, నేడు అధికారికంగా యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.