
న్యూఢిల్లీ: భారత దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు. ఇదే సందర్భంగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముపై ఆయన స్పందించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ భయం లేకుండా, పాక్షపాతం వహించకుండా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ద్రౌపది ముర్మును అభినందించడంలో తాను కూడా దేశ పౌరులతో చేరుతానని యశ్వంత్ సిన్హా తెలిపారు. గణతంత్ర భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిర్భయంగా, నిష్పక్షపాతంగా నడుచుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంచుకున్న ప్రతిపక్ష పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు ఓటేసిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
తాను దేశంపై ప్రేమతో సాధ్యమైన మేరకు, బాధ్యతలతో ప్రవర్తించానని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు. తాను తన క్యాంపెయిన్లో లేవనెత్తిన సమస్యలు వాస్తవమైనవని, అయితే, అవన్ని ఇప్పటికీ ప్రాసంగితకను కలిగి ఉంటాయని తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. భారత ప్రజాస్వామ్యానికి రెండు మార్గాల్లో ఉపయుక్తం అయిందని పేర్కొన్నారు. మొదటిది.. ఈ ఎన్నికల కోసం దాదాపు ప్రతిపక్షాలు అన్నీ కూడా ఒకే వేదికపైకి వచ్చాయని తెలిపారు. ప్రతిపక్షాలు ఏకం కావడం ఇప్పుడు చాలా అవసరం అని, ఈ ఐకమత్యం ఇలాగే కొనసాగాలని, ఉప రాష్ట్రపతి ఎన్నికనూ ఐక్యంగానే ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
రెండోది.. తాను తన క్యాంపెయిన్లో సామాన్య పౌరుడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను లేవనెత్తానని వివరించారు. ప్రతిపక్షాలకు ఎదురవుతున్న సవాళ్లనూ తన క్యాంపెయిన్లో ప్రస్తావించానని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ, గవర్నర్ కార్యాయాలనూ ప్రతిపక్షాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా లేదా వాటిని కూల్చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారని తాను లేవనెత్తానని వివరించారు. తన అభిప్రాయాలకు ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించడమే కాక.. సామాన్య పౌరులూ తన వ్యాఖ్యాలతో కనెక్ట్ అయ్యారని తెలిపారు.
ఇక చివరగా తన తుది శ్వాస వరకు దేశానికి సేవలు అందిస్తానని పేర్కొన్నారు.