
మహారాష్ట్ర : అతనికి పెళ్లయ్యింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ అతడికి డేటింగ్ పురుగు కుట్టింది. దీంతో ఓ ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ లో మ్యాచ్ కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఇంకేముంది అసలే ఎవరు దొరుకుతారా అని చూసే సైబర్ నేరగాళ్లకు మనోడు.. పోయి పోయి.. చిక్కుకుపోయాడు. విడతల వారీగా మొత్తం రూ. 6.3 లక్షలు పోగొట్టుకున్నాక గానీ ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు అసలు విషయం బోధపడలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెడితే..
మహారాష్ట్రలోని థానేకు చెందిన 48 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహితుడు. అతను ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్లో మ్యాచ్ కోసం వెతుకడం మొదలుపెట్టాడు. అలా సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ. 6.3 లక్షలు పోగొట్టుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. మామూలుగా అందరికీ వచ్చినట్లే ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్కు కూడా ఆన్లైన్ డేటింగ్ సేవలను చెబుతూ.. తెలియని నంబర్ నుండి టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. దీంతో అతడిలో ఏదో ఆశ మొలకెత్తింది. అంతే, అందులో ఇచ్చిన నెంబర్ కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తి డేటింగ్ సైట్ లో చేరాలంటే ఎంట్రీ ఫీజుగా రూ.38,200 చెల్లించాలని చెప్పాడు.
భార్యను తల్లిని చేసేందుకు జీవితఖైదీకి బెయిల్... రాజస్థాన్ కోర్టు మంజూరు..
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగే చేశాడు. కానీ అవతలి వ్యక్తి అతడిని ఆ సైట్లో రిజిస్టర్ చేయలేదు. అయితే, ఏదో అనుమానం వచ్చి.. తాను కాల్ చేసిన వ్యక్తి మోసగాడేమోనని.. తన డబ్బు తనకు వాపస్ ఇవ్వమని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్లీ కాల్ చేశాడు. అయితే నిందితుడు మాత్రం.. చక్కగా మాట్లాడుతూ అతడిని మళ్లీ బుట్టలో వేసుకున్నాడు. ఆ డబ్బులు సరిపోవని మరిన్ని కావాలంటూ..మొత్తంగా రూ.6.3 లక్షలు కట్టించుకున్నాడు.
ఆ తరువాత విషయం అర్థమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు సదరు సైబర్ క్రైం నిందితుడి మీద కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సులభా పాటిల్ తెలిపారు.