బెంగళూరు ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది తన షర్ట్ను విప్పేయాలని ఆదేశించారని, అక్కడ కేవలం టాప్ పై నిలబడం ఇబ్బందికరంగా మారిందని ఓ మహిళా ప్రయాణికురాలు ఆరోపించారు. కానీ, ఈ ఆరోపణలు అసత్యాలను సీఐఎస్ఎఫ్ కౌంటర్ ఇచ్చింది.
బెంగళూరు: కర్ణాటకలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది తన షర్ట్ను బలవంతంగా విప్పేశారని ఓ మహిళా ప్రయాణికురాలు ఆరోపణలు చేసింది. ఆమె ఇన్నర్వేర్ పైనే నిలబడాల్సి వచ్చిందని పేర్కొంది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని వివరించింది. కాగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆమె ఆరోపణలు కొట్టిపారేసింది. ఆ మహిళ డెనిమ్ జాకెట్ ధరించిందని, అందులో మెటల్ పార్టులు ఉన్నాయని, ఆ జాకెట్ను స్కానర్ గుండా పంపించాలని అడిగామని సీఐఎస్ఎఫ్ తెలిపింది.
ఆమెను కర్టెయిన్ల వెనుక ఫ్రిస్క్ చేశారని, తన టాప్లో నిలబడటం కంఫర్టబుల్గానే ఉంటుందని మహిళా అధికారులకు చెప్పి బయటకు వెళ్లిందని సీఐఎస్ఎఫ్ తెలిపింది. ఈ ఘటన సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది.
గుజరాత్కు చెందిన క్రిషని గాధ్వి బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు ఇండిగో ఫ్లైట్ ద్వారా వెళ్లడానికి కెంపెగౌడ ఎయిర్పోర్టుకు వచ్చింది. ఆమె ప్రయాణానికి ముందు జరిగిన సీఐఎస్ఎఫ్ చేసిన సెక్యూరిటీ చెక్ గురించి ఆమె ట్వీట్ చేశారు. ‘బెంగళూరు ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో నా షర్ట్ విప్పేయాలని అన్నారు. ఆ సమయంలో చెక్పాయింట్ దగ్గర కేవలం క్యామిసోల్లో నిలబడటం ఇబ్బందికరంగా ఉన్నది. ఒక మహిళగా ఇబ్బంది పడే అటెన్షన్ తనపైకి వచ్చింది’ అని తెలిపారు. ఒక మహిళ దుస్తులను ఎందుకు విప్పించాల్సి వచ్చిందని బెంగళూరు ఎయిర్పోర్టు ట్విట్టర్ హ్యాండిల్ను ట్యాగ్ చేసి ప్రశ్నించారు.
ఆమె అహ్మదాబాద్కు వెళ్లిపోయిన తర్వాత ఎయిర్పోర్టు ఆమె ట్వీట్ పై రెస్పాండ్ అయింది. మీకు జరిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని ఎయిర్పోర్టు తెలిపింది.
కాగా, సీఐఎస్ఎఫ్ మాత్రం ఆమె ఆరోపణలు కొట్టేసింది. తాము సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని, ఒక మహిళా ఫ్రెండ్తో ప్రయాణించిన ఆమె డెనిమ్ జాకెట్ ధరించారని వివరించారు. ఆమె చెబుతున్నట్టు అది షర్ట్ కాదని, డెనిమ్ జాకెట్ అని తెలిపారు. ఆ డెనిమ్ జాకెట్కు మెటల్ పార్ట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆ మహిళ సీఐఎస్ఎఫ్ అధికారి దానిని స్కానర్ గుండా పంపించాలని సూచించిందని తెలిపారు. దీంతో ఆమె ఫ్రెండ్ ఆ జాకెట్ను స్కానర్ గుండా పంపించడానికి ట్రేలో వేయగా గాద్విని అక్కడే ఆ ఎంక్లోజర్లోనే ఉండాలని సూచించినట్టు వివరించారు. కానీ, గాధ్వీనే తనకేం ఇబ్బంది లేదని ఆ టాప్ పై బయటకు వచ్చారని, ఆమెనే ఆ జాకెట్ కలెక్ట్ చేసుకున్నారని తెలిపారు.
ఆమె హ్యాండ్ లగేజీ కూడా రెండు సార్లు చెక్ చేశారని తెలిపారు. ఆమె లగేజీని రెండు సార్లు చెక్ చేయడం మూలంగా ఆమె ఆగ్రహానికి గురైనట్టు గ్రౌండ్ స్టాఫ్ కొందరు వివరించారు. ఆమె ట్వీట్ చేసిన తర్వాత గాధ్వీ మళ్లీ అందుబాటులోకి రాలేదు. ఆమె ట్విట్టర్ అకౌంట్ ను కూడా డియాక్టివేట్ చేశారు. సీఐఎస్ఎఫ్ కౌంటర్ పై ఆమె అభిప్రాయం మీడియాకు అందలేదు.