భర్తతో గొడవలు.. ఆడపడుచే కారణమని పగ పెంచుకొని..!

By telugu news teamFirst Published Oct 5, 2021, 11:51 AM IST
Highlights

హర్షిత మృతదేహం వారి ఇంటికి సమీపంలోని ఒక బావిలో కనిపించింది. హర్షితను తన కోడలు రష్మి హత్యచేసిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

భర్తతో తనకు గొడవలు కావడానికి తన ఆడపడుచే కారణం అనుకుంది. ఆమెపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో పథకం ప్రకారం.. ఆడపడుచును హత్య చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మందసౌర్‌లోని వ్యాస్ కాలనీలో ఉంటున్న హర్షిత శ్రోత్రియ(14) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హర్షితను ఆమె వదినే హత్య చేసిందని, నిందితురాలిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తన భర్త ప్రతీ విషయాన్ని అతని చెల్లెలు షర్షితకు చెప్పడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అక్టోబరు 2న హర్షిత మృతదేహం వారి ఇంటికి సమీపంలోని ఒక బావిలో కనిపించింది. హర్షితను తన కోడలు రష్మి హత్యచేసిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు రష్మిని, ఆమె భర్త సురేష్ శ్రోత్రియ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్షితను తానే హత్య చేశానని రష్మి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈ ఘటనకు దారితీసిన పరిణామాలను పోలీసులు మీడియాకు వివరించారు. సురేష్ శ్రోత్రియ్, రష్మిలకు సోషల్ మీడియాలో పరిచయమయ్యింది. అది ప్రేమగా మారడంతో వారు వివాహం చేసుకున్నారు. రష్మి స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్. సురేష్, రష్మి వివాహం చేసుకున్న తరువాత నుంచి రష్మి తన ఆడపడుచు హర్షితతో అయినదానికి, కానిదానికి గొడవపడేది.

ఈ విషయాలను హర్షిత తన సోదరుడు సురేష్‌కు చెప్పేది. ఈ కారణంగా రష్మి, సురేష్ మధ్య గొడవలు జరుగుతుందేవి. దీంతో ఆడపడుచు హర్షితపై రష్మి పగ పెంచుకుంది. ఈ నేపధ్యంలోనే ఒకరోజు కళ్లకు గంతలు ఆట ఆడుదామని హర్షితను పిలిచిన రష్మి ఆమె కళ్లకు గంతలు కట్టింది. తరువాత కత్తితో హర్షితపై దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన హర్షితను ఇంటికి సమీపంలో ఉన్న బావిలోకి తోసి, దానిపై మూతవేసి అక్కడి నుంచి చల్లగా జారుకుంది. చివరకు పోలీసులకు చిక్కింది.

click me!