
హర్యానా : ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ఓయువతి అత్యంత దారుణమైన ప్లాన్ వేసింది. ప్రేమకథ వెర్రితలలు వేయడంతో మరో అమాయకురాలిని తన ప్రేమ కోసం బలి చేసింది. అచ్చం తనలాగే ఉండే మరో యువతిని చంపి, తానే అని నమ్మించడానికి ప్రయత్నించింది. 2017లో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు తీర్పు వెలువడింది. సదరు ప్రియురాలికి శిక్ష పడింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జ్యోతి, కృష్ణ అనే ఇద్దరు.. కాలేజీలో చదివే రోజుల నుంచి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో జ్యోతి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు.
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ప్రేమను వదులుకోవడం ఇష్టం లేక ఇద్దరు ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యులు మళ్లీ పట్టుకొస్తారని భయపడ్డారో ఏమో.. తెలియదు.. కానీ, వారికి అనుమానం రాకుండా ఉండాలని నిర్ణయించుకుంది జ్యోతి. దీనికోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అచ్చం తనలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని ప్రియుడితో కలిసి నిర్ణయించుకున్నారు. టీవీలో ఒక సీరియల్ ని చూసి దాని ప్రకారం ఈ పథకం వేశారు. ఈ పథకం ప్రకారం అచ్చం తనలాగే ఉండే తన స్నేహితురాలైన సిమ్రాన్ ను జ్యోతి.. 2017 సెప్టెంబర్ 5వ తేదీన జిటి రోడ్డుకు రమ్మని పిలిచింది.
నేను లొంగిపోవడం లేదు : అమృతపాల్ సింగ్ వీడియో యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం..
అక్కడికి వచ్చిన ఆమెతో మాట్లాడుతూ.. అనుమానం రాకుండా మత్తు కలిపిన కూల్డ్రింక్ ఆమెతో తాగించింది. ఆ తరువాత జ్యోతి, కృష్ణ ఇద్దరూ కలిసి ఆమె గొంతు కోసి హత్య చేశారు. సిమ్రన్ దుస్తులను మార్చి జ్యోతి దుస్తులు వేశారు. జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులను సిమ్రన్ మృతదేహం దగ్గర పడేశారు. ఆ తర్వాత ప్రేమికులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. జ్యోతి కనిపించడం లేదని వెతికిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మిస్సింగ్ కేసు కింద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సిమ్రాన్ మృతదేహం దొరికింది. జ్యోతి వేసిన ప్లాన్ ప్రకారమే.. సిమ్రాన్ మృతదేహంచుట్టూ ఉన్న గుర్తింపు కార్డులు, ఆమె దుస్తులను బట్టి మృతదేహం జ్యోతిదే అనుకున్నారు.
కుటుంబ సభ్యులు కూడా జ్యోతి మృతదేహమే అని నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. దాని మీద కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఈ హత్య తాలూకు ఫోటోలను సిమ్రన్ తల్లిదండ్రులకు కూడా చూపించారు. దుస్తులు, గుర్తింపు కార్డులు తమ కూతురివి కావు అని తెలిపారు.. కానీ సిమ్రన్ మెడకు ఉన్న దారం, ముక్కుపుడక ఆధారంగా ఆ మృతదేహం సిమ్రాన్ దే అని గుర్తించారు. దీంతో పోలీసులకు అసలు విషయం అర్థం కావడంతో జ్యోతి, కృష్ణ లను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే 2020లో వారిని సిమ్లాలో గుర్తించారు. అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి కేసు కోర్టు విచారణలో ఉంది. జైలులో ఉన్న కృష్ణ ఆ తర్వాతి కాలంలో క్షయ వ్యాధితో మరణించాడు. దీనికి సంబంధించిన తీర్పు మంగళవారం వచ్చింది. పానిపట్ కోర్టు జ్యోతికి ఈ కేసులో జీవిత ఖైదు విధించింది.