కేరళలో దారుణం జరిగింది. తనకు చికిత్స చేస్తోన్న మహిళా డాక్టర్ను ఓ రోగి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లా కొట్టక్కరలోని తాలూకా ఆసుపత్రిలో 22 ఏళ్ల డాక్టర్ వందనా దాస్ హౌస్ సర్జన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కాలిన గాయాలతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తికి ఆమె చికిత్స చేసి డ్రెస్సింగ్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో రోగి ఆకస్మాత్తుగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడితో ఆగకుండా డాక్టర్ వందనపై అక్కడే వున్న కత్తెర, కత్తులతో దాడి చేశాడు.
అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, రోగులు తీవ్ర గాయాల పాలైన డాక్టర్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరగడానికి ముందు నిందితుడు తన కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం డాక్టర్ వందన పనిచేస్తున్న ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ జరిగిన దాడిలో ఓ పోలిస్ కూడా గాయపడ్డాడు. మరోవైపు.. డాక్టర్ వందన మృతిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ హత్యకు నిరసనగా అత్యవసర సేవల మినహా.. 24 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది.
అటు డాక్టర్ వందన మృతిపై కేరళ హైకోర్ట్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి అసాధారణ రీతిలో ప్రవర్తిస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా డాక్టర్లు బంద్ చేస్తున్నారని.. రోగులకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడింది.