జీఎస్టీ పన్ను భారం తగ్గించే యోచనలో కేంద్రం
న్యూఢిల్లీ: 2018-19 ఆర్ధిక సంవత్సరానికి రూ. 13 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలు కావచ్చని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పీయూష్గోయల్ చెప్పారు. జీఎస్టీ వసూళ్లు పెరిగితే పన్ను రేట్లను తగ్గించేందుకు అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన చెప్పారు.
జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత మరింత మంది వ్యాపారులు పన్ను పరిధిలోకి వచ్చారని మంత్రి చెప్పారు. విలాస వస్తువులు, ఆరోగ్యానికి అయోగ్యకరం కాని ఉత్పత్తులపై గరిష్ఠ స్థాయి పన్నుకు అదనంగా కొంత సుంకాన్ని సైతం విధిస్తున్నారు.
జీఎస్టీ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి గోయల్ ప్రసంగించారు. జీఎస్టీ నెలవారీ వసూళ్ల సగటు రూ.1.10 లక్షల కోట్లు దాటనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరోక్ష పన్నుల ఆదాయం రూ.13 లక్షల కోట్ల స్థాయిని అధిగమించనుందన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో జీఎష్టీ వసూళ్లు రూ.7.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీ వసూళ్ల సరాసరి రూ.89,885 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
మే నెలలో రూ.94,016 కోట్లుగా నమోదయ్యాయి. సాధారణంగానే ఆర్థిక సంవత్సరం మొద టి త్రైమాసికం (ఏప్రిల్-జూ న్)లో పన్ను వసూళ్లు తక్కువగా నమోదవుతాయి. దీంతో రూ.94 వేల కోట్లు వసూలయ్యాయని అధికారులు చెబుతున్న మాటలు తన చెవికి సంగీతంలా వినబడుతోందని గోయల్ చమత్కరించారు.
కాంపొజిషన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే డీలర్లు ఏడాదికోసారి రిటర్నులు దాఖలు చేసేందుకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని ఆర్థిక కార్యదర్శి అధియాను ఆయన కోరారు.