ఇతర మతంలోని వారిని తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్ట్ చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. పలుకారణాలతో హిందూ మతం వదిలి ఇతర మతంలోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి రప్పించాలని ఆయన సూచించారు. కర్ణాటకలోని ఓ మఠంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన అసలు సమస్యకు తాత్కాలిక పరిష్కారమేనని చెప్పారు.
బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య(BJP MP Tejaswi Surya) తన వ్యాఖ్యలతో కొత్త వివాదాన్ని రాజేశారు. ఆయన చేసిన రీకన్వర్ట్ లాంటి మాటలు చర్చనీయాంశం అయ్యాయి. జమ్ము కశ్మీర్ గురించి మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) తాత్కాలిక పరిష్కారమేనని, ఇతర మతంలోని హిందువులను మళ్లీ హిందుమతం(Hindu Religion)లోకి రప్పించాలని ఆయన సూచనలు చేశారు. అంతేకాదు, మఠాలు, ఆలయాలు హిందుమతంలోకి వారిని చేర్పించడానికి వార్షికంగా టార్గెట్లు పెట్టుకోవాలని అన్నారు. కర్ణాటకలో ఉడుపిలోని శ్రీ క్రిష్ణ మఠంలో దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడారు.
‘ఎవరైతే మతం మారారో.... వారి జనాభా ఏరోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉన్నది. ఇదంతా మనం మాట్లాడుకునే ఉన్నాం. మన హిందూ సంస్కృతి ఎప్పటికీ కొనసాగాలంటే.. హిందూ సమాజమూ ఉండాలి. హిందూ సమాజానికే రాజకీయ అధికారం ఉండాలి. రాజకీయ అధికారం సంఖ్యా బలంతో నిర్దేశితం అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో సగం జనాభా వారిది.. సగం జనాభా మనది ఉన్నట్టు చూశాం. నియోజకవర్గాల విభజన తాత్కాలిక పరిష్కారమే. నియోజకవర్గాల విభజన ఈ సమస్యను మరో ఐదు లేదా పదేళ్లు వాయిదా వేయవచ్చు. కానీ, పరిష్కారాన్ని చూపదు’ అని బీజేపీ యువ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు.
ప్రస్తుతం హిందువుల ముందు ఉన్నది ఒకటే అవకాశం అని, హిందూ మతం నుంచి బయటికి వెళ్లిన వారిని మళ్లీ ఈ మతంలోకి రప్పించడమేనని ఎంపీ తేజస్వీ సూర్య తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల రీత్య హిందూ మతాన్ని వదిలిన వారు.. ఇతర కారణాలతో బలవంతంగా హిందూ మతాన్ని వీడిన వారిని తిరిగి హిందూ మతంలోకి తప్పకుండా తిరిగి తేవాలని చెప్పారు. ఇలాంటి వారిని మళ్లీ హిందూ మతంలోకి తేవడానికి ఆలయాలు, మఠాలు వార్షిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అప్పీల్ చేశారు. భారతీయులు తరిమేసిన విదేశీ పాలకుల భావజాలాన్ని వదిలిపెట్టనంత కాలం విజయం సంపూర్ణం కాదని వివరించారు.
ఇదే ప్రసంగంలో ఆయన అఖండ భారత్ అంశాన్ని చూచాయగా స్పృశించారు. పాకిస్తాన్లోనూ మళ్లీ రీకన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. నేడు పాకిస్తాన్లో మతాన్ని మారి జీవిస్తున్నవారిని తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని పేర్కొన్నారు. అప్పుడే భౌగోళిక పాకిస్తాన్ను మనం తిరిగి పొందగలమని తెలిపారు. ఇది ఇప్పుడు అసాధ్యంగా కనిపించవచ్చునని అన్నారు. కానీ, ఆర్టికల్ 370 తొలగించడం, రామ మందిర నిర్మాణం కూడా కొన్నాళ్ల క్రితం అసాధ్యంగానే కనిపించాయని తెలిపారు.
Also Read: జమ్ము కశ్మీర్ ఎన్నికలు, రాష్ట్రహోదాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ రిపోర్టు ఇప్పుడు చర్చనీయ అంశమైంది. కొత్తగా జమ్ముకు ఆరు, కశ్మీర్ ఒక్క నియోజకవర్గాలను అధికంగా కేటాయించాలనే ప్రతిపాదన ఇప్పుడు దుమారం రేపింది. సోమవారం ఢిల్లీలో జరిగిన డీలిమిటేషన్ కమిషన్(Delimitation Commission) సమావేశంలో అసోసియేట్ సభ్యులుగా పాల్గొన్న ఐదుగురు జమ్ము కశ్మీర్ ఎంపీలకు ఆ డ్రాఫ్ట్ కాపీని అందించారు. దీంతో ప్రతిపాదన(Proposal) వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిపాదన అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్ముకు తరలించే కుట్ర అని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి.