
బెంగళూరు: హిజాబ్ వివాదం(Hijab row)పై కర్ణాటక హైకోర్టు(Karnataka High Court)లో వేసిన పిటిషన్ను ఈ రోజు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదలు వాదనలను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ సారథ్యంలోని ధర్మాసనం విన్నది. ఈ రోజు కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీరియస్గా వాదనలు వినిపించారు. అడ్వకేట్ రవి వర్మ కుమార్ పిటిషనర్ల తరఫు వాదిస్తూ.. వేలాది మతాల గుర్తులను(Religious Symbols), సంకేతాలను, వారి మతాలను వ్యక్తపరిచే వాటినీ ధరించి రావడానికి అనుమతిస్తుండగా కేవలం హిజాబ్ను మాత్రమే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.
దుపట్టాలు, గాజులు, టర్బన్లు, శిలువలను, బొట్టులను ధరించే వారిని ఎందుకు ప్రతి రోజు అనుమతిస్తున్నారని అడ్వకేట్ రవి వర్మ కుమార్ వాదించారు. మన విశాల సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన మతపరమైన సంకేతాలను మాత్రమే చర్చిస్తున్నారని తెలిపారు. అందులో కేవలం ఒక్క హిజాబ్ను మాత్రమే ఎందుకు వద్దు అంటున్నారని అడిగారు. హిజాబ్ ఒక్క దాన్నే వద్దనడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. గాజులు వేసుకుంటున్నారని, అది మతపరమైన సింబల్ కాదా? అని అడిగారు. మీరు ఎందుకు కేవలం ముస్లిం అమ్మాయిలనే ఎంచుకున్నారని అడిగారు.
తమ పిటిషనర్ను మతం కారణంగానే క్లాసు రూమ్ నుంచి బయటకు నెట్టేశారు కదా అని వాదించారు. కానీ, ఒక బొట్టు పెట్టుకున్న అమ్మాయిని, గాజులు వేసుకున్న అమ్మాయిని, శిలువ ధరించిన అమ్మాయిని బయటికి పంపలేదని అన్నారు. కానీ, ఈ అమ్మాయిలనే ఎందుకు బయటకు పంపారని అడిగారు. ఇది రాజ్యాంగంలోని అధికరణం 15ను ఉల్లంఘించినట్టేనని పేర్కొన్నారు. గూంగట్లను, గాజులను, సిక్కులు కట్టుకునే టర్బన్ను, శిలువను ధరించే క్రైస్తవులను ఎందుకు బయటకు పంపలేదని అడిగారు. ఇతర మతాల సంజ్ఞలు ధరించిన వారిని అనుమతించినప్పుడు కేవలం హిజాబ్ ధరించినవారిని మాత్రమే ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఇది కేవలం మతం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదా? అని అడిగారు.
కర్ణాటక ఎడ్యుకేషన్ చట్టంలో యూనిఫామ్లో దేన్నీ నిషేధించినట్టు లేదని, అలాంటప్పుడు కేవలం హిజాబ్ను ఎలా నిషేధించగలరని అన్నారు. ఒక వేళ ఎడ్యుకషన్ ఇన్స్టిట్యూట్ యూనిఫామ్ను మార్చాలని భావిస్తే.. ఒక ఏడాది ముందుగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ను పేరెంట్స్ అందించాలని పేర్కొన్నారు.
కాలేజీ డెవలప్మెంట్ కమిటీలో ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండటాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఒక పార్టీ లేదా.. ఒక భావజాలాన్ని కలిగి ఉన్న ఎమ్మెల్యేకు విద్యా సంస్థల నిర్ణయాలకు సంబంధించిన అంశాన్ని అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కమిటీ కూర్పు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వివరించారు.
ఈ వాదనలు విన్న తర్వాత కర్ణాటక హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
హిజాబ్ వివాదంపై అడ్వకేట్ దేవదత్ మంగళవారం వాదిస్తూ.. హిజాబ్ గురించి తాము కొంత హోం వర్క్ చేశామని, ఈ అంశంపై ఇతర దేశాల న్యాయస్థానాలు ఎలా స్పందించాయో కొన్ని చూచాయగా ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన దక్షిణాఫ్రికాలోని(South Africa) ఓ కోర్టు తీర్పును పేర్కొన్నారు. అక్కడి విద్యా సంస్థలో యూనిఫామ్ ఉన్నప్పటికీ కొన్ని మినహాయింపులను ఇవ్వడానికే కోర్టు మొగ్గు చూపిందని అన్నారు. మన దేశానికి చెందిన ఓ హిందూ బాలిక దక్షిణాఫ్రికా స్కూల్లో ముక్కు పుడక పెట్టుకోవడానికి అనుమతులు కోరాల్సి వచ్చిందని వివరించారు. అక్కడ ప్రత్యేకంగా యూనిఫామ్స్ ఉన్నా.. ఇందుకు కోర్టు సమ్మతించిందని తెలిపారు. మినహాయింపు కావాలని కోరినవారిని దండించకుండా.. అందుకు అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు.