తీహార్ జైలుకు స్వాగతం - కేజ్రీవాల్ కు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం..

By Sairam IndurFirst Published Mar 23, 2024, 3:16 PM IST
Highlights

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం పంపించారు. తీహార్ జైలుకు స్వాగతం అని అందులో పేర్కొన్నారు. తాను అప్రూవల్ గా మారుతానని చెప్పారు.

ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కామన్ సుఖేష్ చంద్రశేఖర్.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సందేశం పంపించారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానని అన్నారు. సత్యం గెలిచిందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు శిక్ష పడేలా తాను అప్రూవల్ గా మారుతానని, ఆయన టీమ్ కు సంబంధించిన విషయాలన్నీ బయటపెడతానని చెప్పారు. 

‘‘సత్యం గెలిచింది. ఆయనను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను. ఆయన్ను (కేజ్రీవాల్) ఎండగడతాను. నేను అప్రూవర్ గా మారతాను. అన్ని ఆధారలు ఇచ్చాను. ’’ అని సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా.. మార్చి 11న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. దీంతో ఆమెకు కూడా సుఖేష్ ఇలాంటి లేఖనే పంపించారు. మార్చి 18న రాసిన లేఖలో అతడు.. తీహార్ జైలులో కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పారు. త్వరలో ఇందులో సభ్యులు కాబోతున్నారని పేర్కొన్నారు. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తొందరలోనే అరెస్ట్ అవుతారని సుఖేష్ పేర్కొన్నారు. అక్రమ సంపాదన అంతా బయటపడుతుందని చెప్పారు. అన్ని విషయాల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. కేజ్రీవాల్ ను కాపాడేందుకు ప్రయత్నించవద్దని, కేసులో కావాల్సిన సాక్షాధారాలు అన్ని ఉన్నాయని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. గత గురువారం సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. మరుసటి రోజు ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఏడు రోజుల పాటు కోర్టు కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నేరం ద్వారా వచ్చిన ఆదాయం ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా లబ్ధి చేకూర్చుందని ఈడీ పేర్కొంది. వాటిని 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఉపయోగించుకుందని ఆరోపించింది. 

click me!