New Delhi: ఢిల్లీలో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.
weather update: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత సైతం అధికంగా ఉంది. దీంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో చలిమంటలు వేసుకుంటూ వెచ్చదనం పొందుతున్నారు. ఆయా సమయాల్లో ఇండ్ల నుంచి సైతం బయటకు రావడం లేదు. దీనికి తోడు దట్టమైన పొగమంచు తోడుకావడంతో దృశ్యమానత తగ్గి.. రోడ్డు, ఇతర మార్గల్లో రవాణా వ్యవస్థపై ప్రభావం పడుతోంది. రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న వాతావరణ నివేదికల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ఉత్తర భారత రాష్ట్రాలను ముంచెత్తుతున్న చలిగాలుల నుండి ఉపశమనం ఇంకా లభించలేదు. రాజస్థాన్ , పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఢిల్లీలో చలిగాలుల పరిస్థితులు మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందనీ, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో చలి నుండి తీవ్రమైన చలి వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ రాజస్థాన్ మరియు పంజాబ్ మరియు హర్యానాలోని కొన్ని ప్రదేశాలలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి.
ఐఎండీ వాతావరణ నివేదికల ప్రకారం..
1) తూర్పు ఇరాన్, చుట్టుపక్కల ప్రాంతాలపై తుఫాను ప్రసరణగా తాజా పశ్చిమ భంగం కనిపించిందనీ, దీని వల్ల రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు కురవడంతో పాటు హిమపాతం సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
2) దేశరాజధాని ఢిల్లీలోని ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలను హెచ్చరించింది. శుక్రవారం రాజధానిలో మంచుతో నిండిన పరిస్థితులు ఉన్నప్పటికీ, రాబోయే 24 గంటల్లో చలిగాలులు ఉండే అవకాశం ఉంది. నగరంలోని వాతావరణ కేంద్రం సఫ్దర్జంగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఇతర స్టేషన్లలో చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సమాచారం. ఆయానగర్లో 1.8 డిగ్రీల సెల్సియస్, రిడ్జ్లో 3.3 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్లో 3.8 డిగ్రీల సెల్సియస్, జాఫర్పూర్లో 3.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో సీజన్లో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ వద్ద గురువారం నమోదైంది. ఇది అనేక హిల్ స్టేషన్ల కంటే చల్లగా ఉన్నట్లు నివేదించబడింది.
3) రాబోయే 24 గంటల్లో చాలా చోట్ల గ్రౌండ్ ఫ్రాస్టింగ్ పరిస్థితులు రాజస్థాన్ దాని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్వార్, భరత్పూర్, ధోల్పూర్, జుంజును, కరౌలీతో సహా పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. చురు, సికార్లలో సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక జిల్లాల్లో జనవరి 15 వరకు పాఠశాలలను మూసివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
4) పంజాబ్, హర్యానాలలో, రాబోయే 24 గంటల్లో చాలా చోట్ల చలిగాలుల పరిస్థితులు నెలకొంటాయి, ఇతర ప్రాంతాలలో, రాబోయే రెండు రోజుల్లో చలి నుండి తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉంది. నిన్న 3 డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా నమోదైన భటిండాలో... పరిస్థితులు మరింతగా దిగజారుతాయనీ, చలి తీవ్రత పెరుగుతుందని సమాచారం. "భటిండాలో చాలా పొగమంచు ఉంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూడలేడు. ఎక్కడికో ప్రయాణించడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎటుచూసిన దట్టమైన పొగమంచు ఉంది" అని అక్కడి వారు పేర్కొన్నట్టు ఏఎన్ఐ నివేదించిందతి.
5) రాబోయే 24 గంటల్లో జమ్మూ డివిజన్లో తీవ్రమైన చలిగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. బుధవారం రాత్రి అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లో మైనస్ 9.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది ఇప్పటివరకు కేంద్రపాలిత ప్రాంతంలోనే అత్యంత చలిని నమోదుచేసింది. ఈ ప్రదేశం వార్షిక అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్గా కూడా పనిచేస్తుంది. రాజధాని శ్రీనగర్లో ఇప్పటివరకు ఈ సీజన్లో అత్యంత శీతలమైన రాత్రి మైనస్ 6.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.