కొత్త ప్రైవసీ విధానాలను బలవంతంగా రుద్దం: ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్​

By Siva KodatiFirst Published Jul 9, 2021, 2:32 PM IST
Highlights

కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి వాట్సాప్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ తీరుపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నూతన గోప్యతా విధానంపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది.
 

పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు చట్టంగా మారేంత వరకు కొత్త గోప్యతా విధానాలను వినియోగదారులపై బలవంతంగా రుద్దబోమని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ తెలిపింది. ఆ విధానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం వాట్సాప్, ఫేస్ బుక్ ల తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

ఇప్పటికే ప్రైవసీ పాలసీని చాలా మంది ఆమోదించారని ఆయన కోర్టుకు వివరించారు. బిల్లు పాసై అందులోని విషయాలు తమకు అనుకూలంగా ఉంటే అప్పుడు ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని హరీశ్ సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  ప్రస్తుతానికి వినియోగదారులను ఈ విషయంలో ఇబ్బంది పెట్టట్లేదని, విధానాలకు అంగీకరించని వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, యూజర్లకు మాత్రం ప్రైవసీ పాలసీకి సంబంధించిన అప్ డేట్ మాత్రం కనిపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

Also Read:వాట్సాప్ కొత్త అప్‌డేట్: డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..

కాగా, కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తు చేయాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించడాన్ని తప్పుపడుతూ వాట్సాప్, ఫేస్ బుక్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సంస్థల విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ రెండు సంస్థలు మరోసారి పిటిషన్ దాఖలు చేశాయి. ఆ పిటిషన్ విచారణ సందర్భంగానే వాట్సాప్ కోర్టుకు ఈ విషయం తెలియజేసింది. 
 

click me!