
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరిగింది. పోలింగ్ బూత్లలోని బ్యాలెట్ బాక్స్లు మంగళవారం సాయంత్రం వరకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడ బుధవారం ఓట్లను లెక్కించనున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేసేందుకు కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. క్షణం కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో.. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ కర్ణాటక బళ్లారిలోని భారత్ జోడో యాత్ర క్యాంప్సైట్లో ఓటు వేశారు. పీసీసీ ప్రతినిధులైన 40 మంది కూడా అక్కడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్.. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలోనే ఓటు వేశారు.
శశి థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, మల్లికార్జున ఖర్గే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేశారు.అయితే ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం మద్దతు మల్లికార్జున ఖర్గేకే ఉందన్న సంకేతాల నేపథ్యంలో.. ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక, నేడు శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈరోజు మల్లికార్జున ఖర్గేతో మాట్లానని.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాము సహచరులుగా, స్నేహితులుగా ఉంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. ఇక, 24 ఏళ్ల తర్వాత గాంధీ కుబుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.