రాజ్యసభలో టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన: ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య

First Published Jul 23, 2018, 3:58 PM IST
Highlights

 టీడీపీ ఎంపీల నిరసనపై రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలపై  రాజ్యసభలో సోమవారం నాడు  చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. 

న్యూఢిల్లీ:  టీడీపీ ఎంపీల నిరసనపై రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలపై  రాజ్యసభలో సోమవారం నాడు  చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సభ కార్యక్రమాలకు  అడ్డుపడ్డారు. పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు.  దీంతో వెంకయ్యనాయుడు టీడీపీ ఎంపీలపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విభజన హమీల అమలుపై చర్చ కోరుతూ  టీడీపీ ఎంపీలు సోమవారం నాడు  పార్లమెంట్‌లో  పట్టుబట్టారు. ఈ విషయమై మంగళవారం నాడు చర్చను  చేపట్టనున్నట్టు  రాజ్యసభ ఛైర్మెన్  వెంకయ్యనాయుడు ప్రకటించారు. అయితే ఇవాళే చర్చను చేపట్టాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

పదే పదే రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు వారించినా  కానీ వారు వినలేదు. పోడియం వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  తమ స్థానాల్లోనే కూర్చోని వైసీపీ ఎంపీలు కూడ నిరసన వ్యక్తం చేశారు. 

దీంతో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు స్పందించారు. మీ గోల ఎవరూ వినడం లేదు. చూడడం లేదు. ఇంకా ఎందుకు అరుస్తారంటూ ఏపీకి చెందిన టీడీపీ,వైసీపీ ఎంపీలపై రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాదు  వెంటనే రాజ్యసభ టీవీ ప్రత్యక్షప్రసారాలను నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. దీంతో కొద్దిసేపు ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి.

రాజ్యసభ మొదలు కాగానే  టీడీపీ, వైసీపీ ఎంపీలు  ఇచ్చిన నోటీసులు అందాయని, ఈ తీర్మానంపై  మంగళవారం నాడు చర్చ జరుపుతామని వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ఈ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు  నిరసన వ్యక్తం చేస్తున్నారు.


 

click me!