UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరం నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాని పార్టీలు మహిళల చుట్టే తిరుగుతున్నాయి. దీని కోసం ఆయా పార్టీల్లోని మహిళా నేతలు యూపీ మహిళా శక్తిని తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు ఆ నలుగురు మహిళా నేతలు !
UP Assembly Election 2022: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్,పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయా రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పార్టీలు అధికార పీఠం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తూ.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్ లో అయితే, ఊహించని పరిణామాలతో అక్కడి రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే జనవరి 8న, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు, ఉత్తరప్రదేశ్లో ఓటర్ల సంఖ్య దాదాపు 15 కోట్లకు పైగా ఉందని, ఇందులో మహిళా ఓటర్లు దాదాపు 6.98 కోట్లు మంది ఉన్నారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందనీ, గవత ఎన్నికల కంటే దాదాపు 52 లక్షల మంది మహిళా ఓటర్లు అదనంగా చేరారని అన్నారు. 2017లో మొత్తం 14.16 మంది ఓటర్లలో 6.46 కోట్ల మంది మహిళలు, 7.7 కోట్ల మంది పురుషులు ఉన్నారు. ఆ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం అయ్యారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మహిళ చుట్టే తిరుగుతున్నాయి. వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు, హామీలు ప్రకటిస్తున్నాయి. దీని కోసం ఆయా పార్టీలకు చెందిన మహిళా నేతలు రంగంలోకి దిగారు. యూపీలో మొత్తంగా గమనిస్తే.. నలుగురు మహిళా నేతలు అక్కడి మహిళను ప్రభావితం చేస్తున్నారు. ఆ నలుగురిలో బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి రాజకీయంగా తనదైన ముద్ర వేశారు. ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఎలాగైనా అధికారం లోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీని నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడినప్పటికీ.. తనదైన స్టైల్ లో ముందగువేస్తూ.. ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి అయిన అనుభవం, సరికొత్త ప్రణాళికతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకునే విధంగా ముందుకు సాగుతున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి బలం ప్రియాంక గాంధీ. ఎందుకంటే ఈ సారి ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికలను పూర్తిగా తన భూజాలపై వేసుకుని ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఆమె స్వయంగా తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రియాంక చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలే ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రోజు స్థానిక నేతలకు అందుబాటులో ఉండి ఎన్నికల ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు అత్యధిక టిక్కెట్లు ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చి దానిని అమలు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం. మహిళా ఓట్లను కాంగ్రెస్ పడేలా చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. 40 శాతం మహిళలకు కేటాయించింది.
యూపీలో మరో బలమైన మహిళా నాయకురాలు అనుప్రియా పటేల్. సోనెలాల్ పటేల్ మరణానంతరం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అప్నాదళ్ అధ్యక్షురాలైన అనుప్రియా.. తన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. 2012లో తొలిసారిగా వారణాసిలోని రోహనియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆమె.. 2014లో, NDAతో పొత్తు తర్వాత, ఆమె మీర్జాపూర్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. NDA కూటమిలో కొనసాగుతున్న ఆమె.. మళ్లీ ఈ కూటమి అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. యూపీలో మరో బలమైన మహిళా నాయకురాలు సోనెలాల్ పటేల్ భార్య కృష్ణ పటేల్. కొత్త పార్టీ పెట్టిన ఆమె పోటీ చేసే స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.