
Lucknow : రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం, విత్తన పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకురావడం కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'సాథీ' (SATHI) అనే కొత్త పోర్టల్ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నుంచి విత్తన వ్యాపారులందరూ తమ పూర్తి వివరాలను ఈ పోర్టల్లో అప్డేట్ చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ పోర్టల్ ద్వాారా విత్తనం ఉత్పత్తి అయిన దగ్గరి నుంచి రైతు చేతికి అందే వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల నకిలీ, కల్తీ విత్తనాల బెడదకు చెక్ పెట్టి రైతులకు సరైన, నాణ్యమైన విత్తనాలు అందించడానికి వీలవుతుంది.
ఉత్తరప్రదేశ్లో సాథీ పోర్టల్ను విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యవసాయ డైరెక్టరేట్లో జరిగిన ఈ ట్రైనింగ్లో కేంద్ర ప్రభుత్వ బృందంతో పాటు మహారాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రోజుల ఈ శిక్షణను వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ త్రిపాఠి ప్రారంభించారు.
ఈ శిక్షణలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సీడ్) డాక్టర్ సోను కుమార్ చౌదరి, ఎన్ఐసీ సీనియర్ డైరెక్టర్ (ఐటీ) అర్చన, అవినాష్ విజయకుమార్ పెడ్గావ్కర్, జాయింట్ డైరెక్టర్ నీలాద్రి బిహారీ మొహంతి, వారి బృంద సభ్యులు కోమిత్, సుదీప్ శిక్షణ ఇచ్చారు.
మహారాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ (వ్యవసాయం) డాక్టర్ ప్రీతి సవాయిరామ్, తమ రాష్ట్రంలో ఈ పోర్టల్ ఎంత విజయవంతమైందో, రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందాయో వివరించారు.
విత్తన ఉత్పత్తి సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), విత్తన కంపెనీల ప్రతినిధులను 'మాస్టర్ ట్రైనర్లు'గా తీర్చిదిద్దుతున్నామని అదనపు వ్యవసాయ డైరెక్టర్ (విత్తనాలు, క్షేత్రాలు) అనిల్ కుమార్ పాఠక్ తెలిపారు. ఈ ట్రైనర్లు తమ తమ జిల్లాల్లోని హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు శిక్షణ ఇస్తారు. తద్వారా ఈ కొత్త వ్యవస్థను సరిగ్గా అమలు చేయొచ్చు.
ఇప్పటికే దాదాపు 70 శాతం మంది వ్యాపారులు పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. మిగిలిన 30 శాతం మంది కూడా రాబోయే 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చని సూచించారు.
సాథీ (సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ) పోర్టల్ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. విత్తన ఉత్పత్తి, ధృవీకరణ, పంపిణీలో పారదర్శకత తీసుకురావడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. విత్తన ప్యాకెట్పై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా రైతులు ఆ విత్తనం ఎక్కడ తయారైంది, ఉత్పత్తి చేసిన సంస్థ ఏది, దాని ధృవీకరణ, నాణ్యత వంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించారు. మొదటి రోజు విత్తన ఉత్పత్తి సంస్థలు, ఎఫ్పీఓలు, విత్తన కంపెనీలకు శిక్షణ ఇచ్చారు. రెండో రోజు జిల్లాల హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన వారందరినీ మాస్టర్ ట్రైనర్లుగా తయారు చేశారు. వీరు తమ జిల్లాల్లోని ఇతర డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సాథీ పోర్టల్ గురించి వివరిస్తారు.