ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 డేటా సెంటర్ పార్కులు, ఎక్కడో తెలుసా?

Published : Feb 11, 2026, 08:50 PM IST
Data centers

సారాంశం

యూపీ బడ్జెట్ 2026-27లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి ఏకంగా రూ.2059 కోట్లు కేటాయించారు. ఏఐ మిషన్, 49 ఐటీఐలలో ఏఐ ల్యాబ్‌లు, డేటా సెంటర్ పార్కులు, సైబర్ సెక్యూరిటీ కేంద్రాల ద్వారా డిజిటల్ ఎకానమీకి కొత్త ఊపు ఇవ్వాలని యోగి సర్కార్ ప్లాన్ చేస్తోంది.

Uttar Pradesh Budget 2026 : ఇవాళ (ఫిబ్రవరి 11, బుధవారం) ప్రవేశపెట్టిన ఉత్తరప్రదేశ్ బడ్జెట్ 2026-27లో యోగి ప్రభుత్వం ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. రాబోయే దశాబ్దం టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీదేనని తేల్చి చెప్పింది. 

యూపీ ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి రూ.2,059 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2025-26 బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా 76 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే సంప్రదాయ అభివృద్ధి మోడల్‌తో పాటు టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని అర్థమవుతోంది.

ఉత్తరప్రదేశ్ ఏఐ మిషన్ ప్రారంభం

ఈ బడ్జెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.

  • ఉత్తరప్రదేశ్ ఏఐ మిషన్ కోసం రూ.225 కోట్లు కేటాయించారు.
  • ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 49 ఐటీఐలలో ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
  • ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్స్ ఏర్పాటు కోసం రూ.32.82 కోట్లు కేటాయించారు.

భవిష్యత్ టెక్నాలజీతో యువతను అనుసంధానించి, కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇప్పటికే నడుస్తున్న 'ఏఐ ప్రజ్ఞ' కార్యక్రమం కింద మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఐబీఎం, వన్ ఎం వన్ బీ వంటి కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి. రైతులు, స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

 సైబర్ సెక్యూరిటీపై వ్యూహాత్మక పెట్టుబడి

డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం రూ.95.16 కోట్లతో కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ-సేవలను సురక్షితంగా మార్చేందుకు ఈ చర్య చాలా కీలకమని నిపుణులు అంటున్నారు.

డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న యూపీ

డేటా సెంటర్ పెట్టుబడుల విషయంలో ఉత్తరప్రదేశ్ వేగంగా దూసుకుపోతోంది.

  • సుమారు రూ.30,000 కోట్ల పెట్టుబడితో 8 డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • 900 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
  • ఇప్పటికే 8 ప్రాజెక్టులకు 'లెటర్ ఆఫ్ కంఫర్ట్' జారీ చేశారు. వీటిలో 6 డేటా సెంటర్ పార్కులు, 2 డేటా సెంటర్ యూనిట్లు ఉన్నాయి.
  • వీటి ద్వారా రూ.21,342 కోట్ల పెట్టుబడులు, 644 మెగావాట్ల సామర్థ్యం సమకూరాయి.

డేటా స్టోరేజ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈ పెట్టుబడులు రాష్ట్రంలో డిజిటల్ సేవలకు, స్టార్టప్ వాతావరణానికి బలమైన పునాది వేయగలవు.

మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీలో టాప్

ప్రభుత్వ లెక్కల ప్రకారం, దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.

  • దేశంలోని మొత్తం మొబైల్ ఉత్పత్తిలో దాదాపు 65 శాతం యూపీలోనే జరుగుతోంది.
  • దేశంలోని 55 శాతం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్లు యూపీలోనే ఉన్నాయి.
  • ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.44,744 కోట్లకు పెరిగాయి.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఇది సూచిస్తోంది.

స్టార్టప్ ర్యాంకింగ్‌లో ముందంజ

టెక్నాలజీ, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానాల వల్ల జాతీయ స్థాయిలో స్టార్టప్ ర్యాంకింగ్‌లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. బడ్జెట్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి 76 శాతానికి పైగా నిధులు పెంచడాన్ని నిపుణులు ఒక నిర్ణయాత్మక అడుగుగా భావిస్తున్నారు.

యూపీ బడ్జెట్ 2026-27లో ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీపై పెట్టిన ఈ ఫోకస్.. ఉత్తరప్రదేశ్‌ను డిజిటల్ ఎకానమీలో కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా ఒక పెద్ద ముందడుగు. అయితే, దీని అసలు ప్రభావం పథకాల అమలు వేగం, నైపుణ్యాభివృద్ధి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu