
UttarPradesh: ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా 2022-23 రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో సమర్పించారు. గురువారం నాడు ఆయన రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్.. రెండో సారి అధికారం చెప్పట్టిన తర్వాత ప్రభుత్వం రూ. 6.15 లక్షల కోట్ల తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,15,518.97 కోట్ల బడ్జెట్లో కొత్త పథకాలకు రూ.39,181.10 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,50,270.78 కోట్ల బడ్జెట్ను సమర్పించింది. "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడంలో మేము విజయం సాధిస్తామని మేము నమ్ముతున్నాము" అని ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా బడ్జెట్ను సమర్పిస్తూ చెప్పారు.
అసెంబ్లీలో సురేష్ ఖన్నా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం కోసం రూ. 276.66 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. వీరికి రాష్ట్రంలోని అయోధ్య, కాశీ, మథుర సహా అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాల భద్రత బాధ్యతను అప్పగించారు. పోలీస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద, 112 పథకం రెండవ దశ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందనీ దీని బలోపేతం కోసం రూ.730.88 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. మహిళల కోసం, జిల్లా స్థాయిలో సైబర్ హెల్ప్ డెస్క్ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించామని, మహిళా సాధికారత పథకానికి రూ.72.50 కోట్లు కేటాయించామని ఖన్నా తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగంలో మిషన్ శక్తి కార్యక్రమం కింద మహిళల భద్రత, సాధికారత, నైపుణ్యాభివృద్ధికి రూ.20 కోట్ల కేటాయింపులు ప్రతిపాదించినట్లు తెలిపారు. రైతులకు, రైతు ప్రమాద పథకం కింద రూ.650 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే గరిష్టంగా రూ.5 లక్షలు అందించనున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 15,000 సోలార్ పంపులను ఏర్పాటు చేస్తామని, 60.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేసేందుకు ప్రతిపాదించామని ఖన్నా తెలిపారు. బడ్జెట్లో 119.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ముఖ్యమంత్రి మైనర్ ఇరిగేషన్ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించామన్నారు. యువత కోసం, ఉచిత టాబ్లెట్ మరియు స్మార్ట్ఫోన్ల పథకాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించామని, ఇప్పటి వరకు వారికి సుమారు 12 లక్షల టాబ్లెట్లు/స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశామని చెప్పారు. పార్టీ 'లోక్ కళ్యాణ్ సంకల్ప్' పత్రం ప్రకారం వచ్చే ఐదేళ్లలో యువతకు 2 కోట్ల స్మార్ట్ఫోన్లు/ట్యాబ్లెట్లు పంపిణీ చేయానున్నామని తెలిపారు. స్వామి వివేకానంద యువ సాధికార పథకానికి బడ్జెట్లో రూ.1,500 కోట్లు చేటాయించారు. యువతలో వివిధ రంగాలలో వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, కొత్త యుపి స్టార్టప్ పాలసీ-2020 ప్రకారం, వచ్చే ఐదేళ్లలో మొత్తం 100 ఇంక్యుబేటర్లు మరియు 10,000 స్టార్టప్లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
విద్యార్థులకు ఇంటి దగ్గరే కోచింగ్ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని డివిజన్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నామని, ఈ పథకానికి రూ.30 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. మొదటి మూడు సంవత్సరాల పని కోసం పుస్తకాలు మరియు మ్యాగజైన్లను కొనుగోలు చేయడానికి యువ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించడానికి రూ.10 కోట్ల కేటాయింపు ప్రతిపాదించినట్టు తెలిపారు. వారణాసి జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు భూమి కొనుగోలుకు రూ.95 కోట్ల కేటాయింపులు కూడా ప్రతిపాదించినట్లు తెలిపారు. మీరట్ జిల్లాలో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీకి 2022 జనవరి 02న ప్రధాని శంకుస్థాపన చేశారు, దీని కోసం క్రీడల అభివృద్ధికి మరియు అద్భుతమైన నాణ్యత గల ఆటగాళ్లను తయారు చేసేందుకు రూ.700 కోట్లు ఖర్చు చేస్తారు. యూనివర్శిటీ ఏర్పాటుకు రూ.50 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
ఉపాధి కల్పన కోసం MNREGA పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 26 కోట్ల పనిదినాలు సృష్టించబడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 32 కోట్ల పనిదినాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి గ్రామ పరిశ్రమల ఉపాధిహామీ పథకం కింద 2022-23 సంవత్సరంలో 800 యూనిట్లు ఏర్పాటు చేసి 16 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.