ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కు ఓ చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గం సిరతులో ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రజల నుంచి నిరసన వ్యక్తం చేశారు. కొంత సమయం తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉత్తరప్రదేశ్ (uthrapradhesh) లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లీడర్లు నియోజవర్గాలకు పరుగులు తీస్తున్నారు. తమకు ఓట్లు వేయాలని గ్రామ గ్రామానికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు కోరుతున్నారు. అయితే ఇలా గ్రామాల్లోకి వెళ్లిన సమయంలో కొందరికి అనుకొని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వారు వెనుదిరిగి వచ్చేస్తున్నారు.
తాజాగా.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (deputy cm keshav prasadh mourya) కు ఓ చేదు అనుభవం ఎదురైంది. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం సిరతు (sirathu) లో ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (social media) లో వైరల్గా మారింది. వీడియోలో మౌర్యకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. మహిళలు తలుపులు వేసుకొని కనిపించారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రజలను నిశ్శబ్దంగా ఉండమని కోరడం కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది కావాలని విపక్షాలు చేసిన దుష్ప్రచారమని బీజేపీ పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరతు స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కేశవ్ ప్రసాద్ మౌర్య మొదటిసారిగా తన నియోజకవర్గానికి వచ్చారు. ప్రచారంలో భాగంగా సిరతు అసెంబ్లీ నియోజకవర్గంలోని గులామిపూర్ గ్రామంలో చేరుకున్నారు. అయితే ప్రచారం చేస్తున్న సమయంలో ఆ గ్రామంలోని మహిళలందరూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లి పోయారు.
సీరతులో జిల్లా పంచాయతీ సభ్యురాలు భర్త రాజీవ్ మౌర్య (rajeev mourya) వారం రోజుల నుంచి కనిపించకుండా పోయారు. దీనిని పోలీసులు పట్టించుకోకపోవడంతో డిప్యూటీ సీఎంపై నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. రాజీవ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఇప్పుడు పోలీసులను ఆదేశించారు. ఈ నిరసన పట్ల ప్రతిపక్ష పార్టీ స్పందించింది. ‘‘ ఇది కేశవ్ ప్రసాద్ మౌర్య పట్ల, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పట్ల ప్రజల అసంతృప్తి’’ అని తెలిపింది. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఐ.పి. సింగ్ వీడియోను ట్వీట్ చేశారు.
ఇటీవలే మరో బీజేపీ ఎమ్మెల్యేకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. యూపీలోని ముజఫరనగర్ (muzafar nagar) నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ (vikram singh sainy) ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన మీటింగ్ హాజరయ్యేందుకు బుధవారం వచ్చారు. దీంతో అతడిపై కోపంగా ఉన్న స్థానికులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోవవాల్సి వచ్చింది. అయితే అతడి కారును కూడా స్థానికులు అరుస్తూ వెంబడించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.