అయోధ్య ఆలయంలో అద్భుతాలు...ఆ రోజున రామయ్య విగ్రహంపై నేరుగా సూర్యకిరణాలు

Published : Jan 07, 2024, 10:19 AM ISTUpdated : Jan 07, 2024, 10:42 AM IST
అయోధ్య ఆలయంలో అద్భుతాలు...ఆ రోజున రామయ్య విగ్రహంపై నేరుగా సూర్యకిరణాలు

సారాంశం

అయోధ్య ఆలయంతో ప్రతిష్టించే రామయ్య విగ్రహానికి సబంధించిన వివరాలను తాజాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు.

అయోధ్య : భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అద్భుత కట్టడం అయోధ్య రామమందిరం. హిందువులు దైవస్వరూపంగా కొలిచే శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఈ మందిరాన్ని నిర్మిస్తుండటంతో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రాముడికి ఆలయాన్ని నిర్మించడం... అతి త్వరలో ఆ ఆలయం అందుబాటులోకి వస్తుండటంతో యావత్ భారత దేశంలో పండగ వాతావరణం నెలకొంది. ఆ రామయ్య సుందరరూపాన్ని కనులారా చూసేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  

అయోధ్య ఆలయంతో ప్రతిష్టించే రామయ్య విగ్రహానికి సబంధించిన వివరాలను తాజాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. 51 ఇంచులు పొడవు, 1.5 టన్నుల బరువు కూడిన బాలరాముడు సుందరరూపం భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాదు గర్భాలయ  నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా వుంటుదని... రామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు రామయ్య విగ్రహంపై పడతాయని తెలిపారు. ఇలా అయోధ్య ఆలయం అద్భుత శిల్పకళా సంపద, మంత్రముగ్దుల్ని చేసే అందాలనే కాదు మరెన్నో అద్భుతాలను తనలో దాచుకుందని... అవెంటో త్వరలోనే భక్తులు తెలుసుకుంటారని చంపత్ రాయ్ తెలిపారు. 

అయోధ్య గర్భాలయంలోని రామయ్య విగ్రహ ఎత్తు విషయంలో అంతరిక్ష పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. కాబట్టి ప్రతి సంవత్సరం తెలుగు నెలల ప్రకారం చైత్ర మాసం శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు రామనవమి వస్తుంది... ఈ రోజున సూర్యుడి కిరణాలు రామయ్య విగ్రహంపై పడేలా ఏర్పాట్లు చేసామన్నారు. రామనవమి రోజు మధ్యాహ్నం నేరుగా సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడతాయని ... ఆ సమయంలో రామయ్య దేధీప్యమానంగా వెలిగిపోనున్నారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 

చారిత్రక స్థలంలో నిర్మిస్తున్న ఆలయం కావడంతో గర్భగుడిలో ప్రతిష్టించే రామయ్య విగ్రహం విషయంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. దేశంలోనే టాప్ శిల్పులను సంప్రదించి వారిలో ముగ్గురికి రామయ్య  విగ్రహాన్ని సుందర్భంగా తీర్చిదిద్దే అవకాశం కల్పించామని అన్నారు. వీరిలో ఒకరు చెక్కిన రామయ్య విగ్రహం 1.5 టన్నుల  బరువు, 51 ఇంచుల ఎత్తుతో అద్భుతంగా వుందని... దాన్ని గర్భగుడిలో ప్రతిష్టించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

నల్లటి రాతితో రూపొందిన ఐదేళ్ల అయోధ్య రాములోరి విగ్రహం చూసేందుకు రెండుకళ్ళు చాలవని... ఆ సుందరరూపాన్ని చూసి భక్తులు పారవశ్యం చెందుతారని చంపత్ అని అన్నారు. చిరునవ్వుతో కూడిన అందమైన ముఖం,  ఆకట్టుకునే కళ్లు, ఈ శరీర సౌష్టవంతో విగ్రహం మెరిసిపోతోందని... ఇక గర్భాలయంలో ప్రతిష్టించి ఆభరణాలు ధరిస్తే ఆ సుందరరూపం మరింత కనువిందు చేయనుందని తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 
 
 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood