
71 వేల మంది అపాయింట్ మెంట్ లెటర్లను అందించే రోజ్గార్మేళాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చవల్ గా మంగళవారం ప్రారంభించారు. అయితే కేరళలోని తిరువనంతపురంలోని రైల్వే భవన్లో రోజ్గార్మేళాను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. తరువాత ఆ సమావేశంలో మాట్లాడారు.
10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మంగళవారం దేశ వ్యాప్తంగా 71 వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్లను అందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారితో ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. దేశంలో 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్టార్టప్ ల ద్వారా ఉద్యోగాలు దక్కాయన్నారు. ప్రపంచంలో ఇండియా ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని మోడీ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో దేశంలోని క్రీడా రంగం పునర్వైభవం సాధించిందన్నారు.
దేశంలోనే హైస్పీడ్ రైళ్లతో పాటు ఉపగ్రహలను తయారు చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 2014 ముందు రైల్వే లైన్ విద్యుద్దీకరణకు ఏదు దశాబ్దాలు పట్టిందన్నారు. 2014 తర్వాత 9 ఏళ్లలో 40 వేలకు పైగా రైల్వే లైన్ ను విద్యుద్ధీకరించినట్టుగా చెప్పారు. రక్షణ రంగానికి అవసరమైన కీలకమైన పరికరాలను కూడా దేశంలోనే తయారు చేస్తున్నామని అన్నారు.