ఒమిక్రాన్ వేరియంట్ కలకలం... కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన హైలెవల్ భేటీ

By Siva KodatiFirst Published Nov 28, 2021, 8:18 PM IST
Highlights

ఒమిక్రాన్ వేరియంట్ (omicron variant) ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి (union home secretary) అధ్యక్షతన అత్యవసర భేటి జరిగింది

ఒమ్రికాన్ వేరియంట్ (omicron variant) ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి (union home secretary) అధ్యక్షతన అత్యవసర భేటి జరిగింది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు వీకే పాల్ (vk paul) , ప్రధాని మోదీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్ (vijay raghavan) , ఆరోగ్య, పౌర విమానయానం, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో ప్రపంచ పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేశంలో వివిధ రకాల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు మరింత పటిష్టం చేయాల్సిన అంశాలపై అధికారులు చర్చించారు.

అంతర్జాతీయ, ప్రత్యేకంగా ఓమిక్రాన్ నమోదైన దేశాల ప్రయాణికులకు పరీక్షలు, నిఘాపై ప్రామాణిక నిబంధనల విధానాన్ని సమీక్షించారు. వేరియంట్‌ల గుర్తింపు కోసం జినోమిక్ నిఘాను బలోపేతం చేయాలని నిర్ణయించారు. విమానాశ్రయాలు/పోర్టులలో టెస్టింగ్ ప్రోటోకాల్‌ను కఠినంగా పర్యవేక్షించేలా ఎయిర్‌పోర్ట్ హెల్త్ అధికారులు, పోర్ట్ హెల్త్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశంపై నిర్ణయాన్ని సమీక్షించాలని నిర్ణయించారు. దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని నిశితంగా పరిశీలించడం జరుగుతుందని వెల్లడించారు. 

ALso Read:Omicron : ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.. నెగిటివ్ వస్తేనే ఇంటికి, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

మరోవైపు కరోనా వైరస్ (coronavirus) కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకే మార్గదర్శకాలను (guide lines) విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లపై (containment zones) ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు ,  కేంద్ర పాలిత ప్రాంతాలకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది కేంద్రం. హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. 

కేంద్రం గైడ్‌లైన్స్: 

  • ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్.
  • ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని రాష్ట్రాలకు సూచన.
  • కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశం.
  • కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తింపు.
  • హాట్‌ స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచన.
  • పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి.
  • తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన.
  • కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలి.
  • కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచన.
  • ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని సూచన.
  • తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని సూచన
click me!