
జమ్మూకాశ్మీర్లో (jammu and kashmir) వరుస హత్యల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) అత్యవసర సమావేశం నిర్వహించారు. అమిత్ షాతో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ , ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. హిందువులే టార్గెట్గా జరుగుతున్న హత్యల దృష్ట్యా కాశ్మీర్ పండిట్లు (kashmir pandits) , ఇతర స్థానికేతరుల భద్రతపై చర్చించారు.
ప్రభుత్వ ఉద్యోగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పండిట్లకు భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది కేంద్రం. కశ్మీర్లో జరుగుతున్న ఘటనలను తక్షణమే అణచివేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా ఘటనలు జరగడానికి అసలు కారణాలేమిటన్న దిశగానూ ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
Also REad:కాశ్మీర్ లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు వలస కార్మికులపై కాల్పులు.. ఒకరు మృతి..
కాగా.. రాజస్తాన్కు చెందిన విజయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లా అరె మోహన్పొరాలోని ఇల్లాఖీ దెహతి బ్యాంక్ బ్రాంచ్కు మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం ఆయన బ్యాంకుకు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.
షోపియన్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలోనే బ్యాంక్ మేనేజర్ హత్య జరిగింది. ఇక .. ఇదే దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితమే హిందూ మహిళను ఉగ్రవాదులు చంపారు. రజ్నీ బాలా అనే కశ్మీరీ పండిట్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. భర్త, కుమార్తెలతో ఆమె సాంబాలో నివసించేవారు. కానీ, ఈ మహిళా ఉపాధ్యాయురాలిని రెండు రోజుల క్రితమే ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
గతవారం టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ను లష్కర్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 12వ తేదీన రెవెన్యూ డిపార్ట్మెంటులో పని చేస్తున్న రాహుల్ భట్నూ ఉగ్రవాదులు కాల్చి చంపేసిన ఘటన తెలిసిందే. కొన్నాళ్లుగా జమ్ము కశ్మీర్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడుతున్నారని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.