హైదరాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా..

Published : Mar 12, 2023, 09:29 AM IST
హైదరాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే  కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా..

సారాంశం

హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో ఆదివారం జరిగిన 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో ఆదివారం జరిగిన 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇందుకోసం శనివారం రాత్రి అమిత్ షా నగరానికి చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్‌, తదితరులు స్వాగతం పలికారు. 

ఈ రోజు ఉదయం  సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..  5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రతిపాదించారని గుర్తుచేశారు. ఇందుకోసం ఓడరేవులు, విమానాశ్రయాలు మొదలైన వాటి రక్షణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గత 53 ఏళ్లుగా సీఐఎస్‌ఎఫ్ వాటికి రక్షణ కల్పిస్తుందని గుర్తుచేశారు. 

ఓడరేవులు, విమానాశ్రయాలు మొదలైన వాటిని రక్షించడానికి రాబోయే కాలంలో అన్ని సాంకేతికతలతో సీఐఎస్‌ఎఫ్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. చాలా మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. సీఐఎస్ఎఫ్ వల్ల నక్సలైటులు, ఉగ్రవాదులు అదుపులో ఉన్నారని అమిత్ షా పేర్కొన్నారు. 

ఇక, 1969 మార్చి 10న భారత పార్లమెంట్ చట్టం ప్రకారం సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 10న సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే జరుపుకుంటున్నారు. ఈ ఏడాది సీఐఎస్‌ఎఫ్ వార్షిక రైజింగ్ డే వేడుకలు ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. అధికారుల ప్రకారం.. సీఐఎస్‌ఎఫ్ దేశ రాజధాని న్యూఢిల్లీ వెలుపల రైజింగ్ డే వేడుకలను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ వేడుకలు ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్ మైదానంలో జరిగేవి. గత ఏడాది ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) 53వ రైజింగ్ డే వేడుకకు అమిత్ షా హాజరయ్యారు. ఇక, గత రెండు సంవత్సరాలుగా.. అన్ని పారామిలటరీ బలగాలు ఢిల్లీ వెలుపల తమ రైజింగ్ డేని జరుపుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 10న ట్విట్టర్ వేదికగా.. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు సెల్యూట్ చేశారు. ‘‘సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వారి రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు. భారతదేశం క్లిష్టమైన మౌలిక సదుపాయాలు, బహిరంగ ప్రదేశాలను సురక్షితం చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. దేశ భద్రత పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అని అమిత్ షా తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works