
Telangana: కేంద్రం వరి సేకరణ వివక్షతో కూడుకున్నదని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తున్నాయని టీఆర్ఎస్ నాయకురాలు కె.కవిత ఆదివారం అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర తీరును ఖండిస్తూ... టీఆర్ఎస్ నిరసనలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 11న దేశ రాజధానిలో కేంద్ర వరి సేకరణ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిరసనకు దిగనుంది. టీఆర్ఎస్ నిరసనకు దిగే స్థలాన్ని కవిత పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యాలు చేశారు.
కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పుగా ఉన్నాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులు ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. అయితే, తెలంగాణలోని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతుందని అన్నారు. 'భారత్లో ఏ ప్రభుత్వం కూడా రైతులను పణంగా పెట్టి అభివృద్ధి చెందలేదని పేర్కొన్న ఆమె.. రైతులను విస్మరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల పట్ల కేసీఆర్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు, చర్యలను ఆమె కొనయాడారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న బంజరు తెలంగాణను సుసంపన్నమైన, ఉత్పాదక భూమిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అన్నారు.61 లక్షల మంది రైతుల హక్కుల కోసం రేపు టీఆర్ఎస్ మొత్తం ఢిల్లీ వీధుల్లోకి వచ్చి పోరాడుతోందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ పాల్గొంటారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది, అయితే పారా బాయిల్డ్ రైస్ కాదు, ముడి బియ్యాన్నే కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగాయి. ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 6న జాతీయ రహదారులను దిగ్భంధించారు.ఈ నెల 7న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ నెల 8న వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసనకు దిగారు. ఈ నెల 11న దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. భారీ ఎత్తున్న ఢిల్లీ నిరసనలు నిర్వహించడానికి సిద్ధమైంది.
వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిరసన దీక్ష చేయనుంది.ఈ దీక్షలో తెలంగాణ సీఎం KCR కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఈ నెల 4వ తేదీ నుండి వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తుంది. సోమవారం ఆందోళనలతో తొలి విడత నిరసనలు ముగియనున్నాయి. తెలంగాణలో పండిన ప్రతిగింజా కొనే వరకు పోరు సాగిస్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.