
ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ జిల్లా స్థాయి నేత జీతూ చౌదరిపై కాల్పులు జరిగాయి. దీంతో ఆయనను చికిత్స కోసం నోయిడాలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ‘‘ స్థానిక BJP నాయకుడు జితు చౌదరి ఈ సాయంత్రం 8:15 గంటల ప్రాంతంలో మయూర్ విహార్ ఫేజ్-3లో కాల్చి చంపబడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. నేరం జరిగిన ప్రదేశంలో కొన్ని ఖాళీ కాట్రిడ్జ్లు, ఇతర ముఖ్యమైన ఆధారాలు లభించాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తాం’’ అని తూర్పు డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు.
దాడికి పాల్పడిన గుర్తు తెలియని దుండగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..‘‘ బాధితుడు తన ఇంటి ఎదుట రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్నాడు. బాధితుడికి శరీరంపై తుపాకీ గాయాలు ఉన్నాయి. దీంతో స్థానికులు గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.’’ అని పోలీసులు చెప్పారు.
అయితే నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఖాళీ కాట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.