
Heavy rains in Maharashtra: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతుండటంతో వరదలు సంభవించాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలతో ఈ మరణాలు సంభవించాయి.
వివరాల్లోకెళ్తే.. ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో పాటు చాలా ప్రాంతాల్లో మేఘావృత ఆకాశం కనిపించింది. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల రాకతో చాలా మంది ఢిల్లీ వాసులు సంబరపడుతుండగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
మహారాష్ట్రలో వరదలు..
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబయిలో వరదలు సంభవించాయి. నీటమునిగి ప్రాణనష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తిని కౌశల్ దోషి (38)గా గుర్తించామనీ, భారీ వర్షానికి చెట్టు నేలకూలిందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో థానే, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయనీ, దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, చెట్లు విరిగిపడిన సంఘటనలు అనేకం జరిగాయని అధికారులు గురువారం తెలిపారు.
గత రెండు రోజుల్లో వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా, మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
గుజరాత్ కు రెడ్ అలర్ట్
నైరుతి రుతుపవనాలు మంగళవారం గుజరాత్ ను పూర్తిగా కవర్ చేశాయి. అదే రోజు దక్షిణ గుజరాత్ జిల్లాలైన నవ్సారి, వల్సాద్ లకు రెడ్ అలర్ట్ జారీ చేశామనీ, ఈ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.