త్రిపురలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, అత్తను చంపేసి, వారి శరీరాలను పిల్లల ముందే నరికాడు. దీంతో తీవ్రమైన భయానికి లోనై పిల్లలు వణికిపోయారు.
గౌహతి: త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, అత్తను చంపేసి, వారి శరీరాలను ముక్కలుగా నరికాడు. పిల్లల ముందే అతను ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను చూడలేక పిల్లలకు భయంతో కేకలు వేశారు.
ఆ తర్వాత అతను విషం సేవించాడు. త్రిపురలోని ధలాయి జిల్లాలో సోమవారంనాడు ఈ సంఘటన జరిగింది. రక్తం మడుగులో పడి ఉన్న మహిళల మృతదేహాలను చూసి, పిల్లల భయానమైన కేకలను విని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
అత్తారింట్లో ఆ ఘాతుకానికి పాల్పడిన ఆ వ్యక్తి త్రిపుర రాజధాని అగర్తాలాకు 7 కిలోమీటర్ల దూరంలోని వెస్ట్ త్రిపురలో గల హపానియాకు చెందినవాడు. విషం తీసుకున్న వ్యక్తి మరో గదిలో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు.
నిందితుడిని అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అతని శరీరంలో విషం తీసుకున్న ఆనవాళ్లు కనిపించాయని, అయితే అతని ప్రాణాలకు ముప్పు లేదని చెప్పారు. హత్యలకు గల కారణం తెలియరాలేదు. పోలీసులు అతన్ని విచారించాల్సి ఉంది. అతను అగర్తాలాలోని జీబీపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.