తమిళనాడులో క్షుద్రపూజల కలకలం.. చిన్నారిని బలిచ్చేందుకు సిద్ధం.. ఇంతలో.. !!

By AN TeluguFirst Published Aug 27, 2021, 11:07 AM IST
Highlights

ప్రతీ అమావాస్యకు మాత్రమే ఊళ్లోని తన సొంతింటికి వచ్చేవాడు. అలా వచ్చిన ప్రతీసారి ఇల్లు శుభ్రం చేసి, రాత్రంతా ఏవేవో పూజలు చేసి మళ్లీ తెల్లవారేసరికి మాయమయ్యేవాడు.

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ క్షుద్రపూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్షుద్రపూజలు చేసి బలివ్వడానికి ఓ పసిబిడ్డను సిద్ధం చేశారు. స్థానికులు గమనించడం క్షణం ఆలస్యం అయి ఉంటే.. ఆ పసిబిడ్డకు నిండునూరేళ్లు నిండేవి.

గ్రామస్తుల చొరవతో ఈ వ్యవహారంలో దారుణం జరగకుండా ఆగిపోవడమే కాకుండా.. ఓ పసిప్రాణం మూర్ఖుడి కత్తికి బలి కాకుండా రక్షించబడింది. తమిళనాడులోని రాణిపేట, అరకోణంలో ఈ ఘటన జరిగింది. అరకోణంలో ఉండే ఆశీర్వాదం అనే వ్యక్తం కొంత కాలం క్రితం ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

అతను వెళ్లిపోవడానికి గుప్తనిధులే కారణమని తెలుస్తోంది. గుప్తనిధుల అన్వేషణలోనే అతను వాటిని గాలిస్తూ అతను ఊరొదిలి వెళ్లిపోయాడు. అయితే, ప్రతీ అమావాస్యకు మాత్రమే ఊళ్లోని తన సొంతింటికి వచ్చేవాడు. అలా వచ్చిన ప్రతీసారి ఇల్లు శుభ్రం చేసి, రాత్రంతా ఏవేవో పూజలు చేసి మళ్లీ తెల్లవారేసరికి మాయమయ్యేవాడు.

ఈ విషయాన్ని గ్రామస్తులు గమనించారు. కొన్ని అమావాస్యలపాటు అతనేం చేస్తున్నాడో చూశారు. అనుమానించారు. ఈ క్రమంలో తాజాగా మొన్న సొంతూరు వచ్చాడు. తనతో పాటు ఓ పాపను కారులో తీసుకొచ్చాడు. నేరుగా ఇంట్లోకి వెళ్లి లోపలినుంచి తాళం వేసుకున్నాడు. ఇది గ్రామస్తులు గమనించారు.

అప్పటికే అనుమానం ఉండడంతో.. గ్రామస్తులు ఏం జరుగుతోందో గమనించారు. ఇల్లు క్లీన్ చేయడం, పసుపు, కుంకుమలతో పూజలు చేయడం అన్నీ గమనించారు. చివరికి జరగబోయే ఘటన వారిని షాక్ కు గురిచేసింది. ఆశీర్వాదం ఏవో క్షుద్రపూజలు చేస్తున్నాడు. అతనితో కర్నాటక నుంచి వచ్చిన ఇద్దరు స్వామీజీలూ ఈ తంత్రంలో పాల్గొన్నారు. 

అంతేకాదు, కాసేపట్లో ఓ పాపను బలివ్వడానికి రెడీ అయినట్లుగా అక్కడి దృశ్యం చెబుతోంది. అంతే గ్రామస్తులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అందర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. నిందితుల్ని వారికి పట్టించారు.

కాగా, గుప్తనిధులు, క్షుద్రపూజలతో పాటు.. ఆ పాప ఎవరు, ఎక్కడినుంచి తీసుకొచ్చారు? ఈ తంతు వెనుక ఉద్దేశ్యమేంటి అనే విషయాలు తేల్చే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. 

click me!