
Drugs Seized in Gujarat: డ్రగ్స్ కట్టడి కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అధికారుల కళ్లు గప్పి విదేశాల నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి తరలి వస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. సెలబ్రిటీల, సంపన్న కుటుంబీకులు చెందిన పిల్లలు, యువతకు డ్రగ్స్ చేరవేసి.. కోట్లు దండుకుంటున్నారు. మనదేశంలో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాల ముఠాలే ఇందుకు సాక్ష్యం. అధికారులు ఎంత నిఘా పెట్టినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో వాటిని తీసుకొస్తున్నారు.
తాజాగా గుజరాత్లో మరోమారు భారీ మొత్తంలో మత్తు పదార్దాలు బయటపడ్డాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇటెలిజెన్స్(డీఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. పిపావావ్ పోర్ట్లోని ఓ కంటైనర్లో దాదాపు 90 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.450 కోట్లకుపైనే ఉంటుందని రాష్ట్ర డీజీపీ ఆశిశ్ భాటియా తెలిపారు. ఇరాన్లోని అమ్రేలి జిల్లా నుంచి తరలించినట్టు చెప్పారు.
అధికారుల కళ్లుగప్పి మత్తుపదార్థాలను చేరవేసేందుకు డ్రగ్ సిండికేట్.. హెరాయిన్తో కూడిన ద్రావణంలో ధారాలను నానబెట్టే.. ఆ తర్వాత వాటిని కాల్చి, వచ్చిన పొడిని ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. గత వారం రోజుల్లో గుజరాత్లో 2180 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిందని రాష్ట్ర డీజీపీ ఆశిశ్ భాటియా తెలిపారు. గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ, కస్టమ్స్ సంయుక్త ఆపరేషన్లో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయని, గత వారం రోజుల్లో వివిధ దాడుల్లో 436 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపారు.
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్లు జరిపిన ఆపరేషన్లో 9 మంది పాకిస్థానీలతో పాటు 'అల్ హాజ్' అనే బోటును పట్టుకున్నట్లు గుజరాత్ డీజీపీ తెలిపారు. అందులో నుంచి 56 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ బృందాన్ని ఢిల్లీకి పంపినట్లు డీజీపీ తెలిపారు. అలాగే.. ముజఫర్నగర్లో 35 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇది కాకుండా.. ఎసిటిక్ అన్హైడ్రైడ్ బారెల్స్ కూడా కనుగొనబడ్డాయి. 4 మంది నిందితులను అరెస్టు చేశారు. ATS-NCB యొక్క జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు.
గుజరాత్ డిజిపి ప్రకారం, ఇద్దరు నిందితులను గుజరాత్ ఎటిఎస్ అరెస్టు చేయగా.. మరో ఇద్దరిని ఎన్సిబి విచారిస్తోంది. దీని ఆధారంగా షాహీన్ బాగ్ (ఢిల్లీ)లో మరో 30 లక్షల రూపాయలతో సహా 50 కిలోల హెరాయిన్, మరికొన్ని పౌడర్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కాండ్లా ఓడరేవులో కంటైనర్లో 205 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. DRI ద్వారా తదుపరి విచారణ జరుగుతోంది. ప్రధాన నిందితుడు జోబన్ సింగ్ను తరన్ తరణ్ నుంచి పట్టుకున్నారు. రిమాండ్కు తరలించి విచారిస్తున్నారు.