భానుడి ప్రతాపం.. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు బ్రేక్ చేయొచ్చు.. మే 2 వరకు ఉపశమనం లేదు: ఐఎండీ అంచనాలివే

Published : Apr 30, 2022, 03:54 PM IST
భానుడి ప్రతాపం.. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు బ్రేక్ చేయొచ్చు.. మే 2 వరకు ఉపశమనం లేదు:   ఐఎండీ అంచనాలివే

సారాంశం

భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొనసాగుతూనే ఉన్నది. మే నెల 2వ తేదీ వరకు ఈ మండే ఎండలు తప్పవని, ఆ తర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది.

న్యూఢిల్లీ: వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపిస్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు, నీరసం, డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా, వాతావరణ శాఖ మరో హాట్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈ ఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది.

ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని, పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌లు క్రాస్ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగాలులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. ఈ పరిస్థితులు మే నెల 2వ తేదీ వరకు తప్పవని వివరించింది. అప్పటి వరకు ఈ ఉష్ణోగ్రతలు, వడగాలులతో ఉపశమనం లేదని పేర్కొంది.

సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటీయరాలజీ డాక్టర్ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి, పశ్చిమ రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌లను తాకొచ్చని వివరించారు.

ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ, పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంపరేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు. ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు.

మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను దాటేశాయి. కాగా, ఏప్రిల్ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8 డిగ్రీలు), ఝాన్సీ (46.2 డిగ్రీలు), లక్నో (45.1 డిగ్రీలు) లు ఆల్ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్ చేశాయి.

ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలా చోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని మోహపాత్రా వివరించారు. అయితే, మే2వ తేదీ వరకు వాయవ్య, మధ్య భారతంలో వడగాలులు మాత్రం తీవ్రంగానే ఉంటాయని, తూర్పు భారతంలో మాత్రం ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu