
Tamil Nadu Urban local body polls: తమిళనాడులో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. మొత్తం ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 19న పోలింగ్ , ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరిగేలా షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వీ పళనికుమార్. ఈ మేరకు బుధవారం సాయంత్రమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నది తెలిపారు.
ఎన్నిక షెడ్యూల్ ప్రకారం..
1) జనవరి 28న నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 4న నామినేషన్ ఉపసంహరణ
2) ఫిబ్రవరి 5 నామినేషన్ల పరిశీలన
3) ఫిబ్రవరి 19న పోలింగ్, ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు.
4) మార్చి 2న కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ చైర్మన్ల పరోక్ష ఎన్నిక
5) మార్చి 4వ తేదీ ప్రమాణ స్వీకారం
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం (TNSEC) రాష్ట్రంలో వున్న 21 కార్పొరేషన్లు, 138 పట్టణ పంచాయతీలు, 490 మున్సిపాలిటీల్లో తక్షణమే అమలులోకి వచ్చేలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ప్రకటించింది. TNSEC సెప్టెంబర్ 2016లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కోసం నోటిఫికేషన్ను ప్రకటించింది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. కేవలం గ్రామీణ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టు కొరడా ఝళిపించేందుకు సిద్ధమవ్వడంతో ఆగమేఘాలపై స్పందించిన అధి కారులు.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, మధురై, వెల్లూరు, తిరుచ్చి, సేలం, ఇతర నగరాలకు త్వరలో ఆరేళ్ల తర్వాత మేయర్లను ఎన్నుకోనున్నారు. కార్పొరేషన్, పట్టణ పంచాయితీ, మున్సిపాలిటీ పదవులకు సంబంధించి రిజర్వేషన్ల పనులు కూడా చకచకా పూర్తి చేశారు. దాంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 2,79,56,754 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 1,37,06,793 మంది కాగా, మహిళా ఓటర్లు 1,42,45,637, హిజ్రాలు 4,324 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికల కోసం 31,029 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 1.33 లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 80 వేల మంది పోలీసులు పాల్గొనన్నారు. మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థి
ఎన్నికల వ్యయం రూ.17 వేలు, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ అభ్యర్థి రూ.34 వేలు, చెన్నై కార్పొరేషన్లో అభ్యర్థి రూ.90 వేలుగా నిర్ణయించారు.
ప్రచారం కరోనా ఎఫెక్ట్..
కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రచారం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇంటింటి ప్రచారానికి ముగ్గురిని మాత్రమే అనుమతించనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అంతేగాక ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని ఆదేశించింది.