
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు స్వచ్ఛతా హి సేవా 2023 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో శ్రమదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ సైకత కళారూపాన్ని రూపొందించారు. ఒడిశా రాష్ట్రంలోని పూరీ బీచ్ లో రూపొందించిన ఈ సైకత కళారూపం పలువురిని ఆకట్టుకుంటుంది. క్లీన్ ఇండియా దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి మోడీ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంపై గత నెల 15వ తేదీ నుండి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.