Ram Setu: రామసేతు ఉన్న ప్రాంతంలో చుటూ గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పరిపాలనాపరమైన నిర్ణయమని సుప్రీంకోర్టు చెబుతోందని, గోడను నిర్మించాలని కోర్టు ఎలా సూచనలు ఇస్తుందని పిటిషనర్ను ప్రశ్నించింది. అలాగే. రామసేతుని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
రామసేతు ఉన్న ప్రాంతం ప్రజలకు కనిపించడం కోసం అక్కడ గోడ నిర్మించాలని హిందూ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అశోక్ పాండే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా దాఖలు చేశారు. అలాగే.. న్యాయవాది పాండే.. 'రామసేతు'ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని కోరారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ను కూడా తన పిటిషన్ తో జతచేయాలని ధర్మాసనానికి అభ్యర్థించారు. రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్లో కోరారు.
ఈ పిటిషన్ను విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించింది. ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనా వ్యవహరమనీ, దీన్ని తామెందుకు చూడాలని పేర్కొంది. అలాగే.. జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన పిల్ని సైతం సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. గతేడాది నవంబర్లోనూ.. ఈ పిల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకొహ్లీ, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం పరిశీలించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ.. తాజా ధర్మాసనం మాత్రం ఈ పిల్ని తిరస్కరించడం గమనార్హం.
'రామసేతు'ను ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో ఉన్న పాంబన్ ద్వీపం, శ్రీలంక వాయువ్య తీరంలో మన్నార్ ద్వీపం మధ్య సున్నపురాయి ఉద్గారాల శ్రేణి.