ఉత్కంఠకు తెర: పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం అనుమతి.. కానీ..!!

By Siva KodatiFirst Published Jun 22, 2020, 4:28 PM IST
Highlights

పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుందో లేదోనన్న సస్పెన్స్‌కు సుప్రీంకోర్టు తెరదించింది. భక్తులు లేకుండా రథయాత్ర జరపుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ని ఇచ్చింది. రథయాత్రకు ఒడిషా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది

పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుందో లేదోనన్న సస్పెన్స్‌కు సుప్రీంకోర్టు తెరదించింది. భక్తులు లేకుండా రథయాత్ర జరపుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ని ఇచ్చింది. రథయాత్రకు ఒడిషా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది.

కేవలం పూరీలోనే రథయాత్ర నిర్వహించాలని అది కూడా ప్రజలెవ్వరికి అనుమతి లేదని సుప్రీం తెలిపింది. భక్తులు లేకుండా కరోనా ఆంక్షలతో జగన్నాథ రథయాత్ర నిర్వహించుకోవడానికి తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. 

ఈ వేడుక నిర్వహణపై ఇచ్చిన స్టేను సవరించాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మరోవైపు భారత ప్రభుత్వ వాదనకు ఒడిషా ప్రభుత్వం సైతం మద్ధతుగా నిలిచింది.

దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

ఈ వేడుక ప్రజల విశ్వాసానికి సంబంధించినదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 23న ఈ వేడుక నిర్వహించలేకపోతే.. సంప్రదాయం ప్రకారం మరో 12 ఏళ్ల పాటు రథయాత్రను వాయిదా వేయాల్సి వుంటుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రథయాత్ర నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. అవసరమైతే ఒకరోజు కర్ఫ్యూ కూడా విధించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అనాదిగా రథయాత్రలో భాగం అవుతున్న కుటుంబాలకు చెందిన 600 మంది సేవకులు మాతరమే యాత్ర నిర్వహణను చూసుకుంటారని తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

కాగా కరోనా కారణంగా పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని సుప్రీంకోర్టు జూన్ 18న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే అవకాశం వున్నందున రథయాత్ర నిర్వహించడం శ్రేయస్కరం కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

click me!